అక్షరటుడే, వెబ్డెస్క్ : Sadabainama Registration Changes | సాదాబైనామా రిజిస్ట్రేషన్ నిబంధనల్లో రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక మార్పులు చేసింది. దీంతో లక్షలాది మంది దరఖాస్తుదారులకు ఊరట లభించనుంది.
బీఆర్ఎస్ (BRS) హయాంలో సాదాబైనామాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. గతంలో భూమి కొనుగోలు చేసిన వారితో పాటు అమ్మిన వారి అఫిడవిట్ ఉండాలనే నిబంధన ఉండేది. అయితే అప్పట్లో వివిధ కారణాలతో భూములు అమ్మిన వారు.. ప్రస్తుతం ధరలు పెరగడంతో అఫిడవిట్ ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. భూమి కొన్న వారి దగ్గర మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల తండ్రులు భూములు అమ్మగా వారి వారసులు సాధాబైనామా కింద రిజిస్ట్రేషన్కు ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూమి హక్కుల కోసం దరఖాస్తుదారుడితో పాటు భూమిని బదిలీ చేసే వ్యక్తి కూడా అఫిడవిట్ సమర్పించాలనే నిబంధనను తొలగించింది.
Sadabainama Registration Changes | తప్పుగా తేలితే కఠిన చర్యలు
ఇక నుంచి భూమి హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అయితే తప్పుడు సమాచారం అందించినట్లు తేలితే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. సదరు సాదాబైనామా రిజిస్ట్రేషన్ను రద్దు చేయడంతో పాటు చెల్లించిన ఫీజులు, స్టాంపు డ్యూటీని జప్తు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అంతేగాకుండా క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించింది.
Sadabainama Registration Changes | 30 రోజులు గడువు
సాదాబైనామా రిజిస్ట్రేషన్లకు (Sadabainama Registration) ముందు 30 రోజులు అభ్యంతరాల స్వీకరణ కోసం గడువు ఇస్తారు. నిర్ణిత గడువులోగా ఎవరైనా అభ్యంతరం చెబితే ఆ రిజిస్ట్రేషన్ను నిలిపి వేస్తారు. లేదంటే ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ కొత్త నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. కాగా సాదాబైనామా కింద గతంలో మొత్తం 9,00,880 దరఖాస్తులు వచ్చాయి.
ఐదు ఎకరాల్లోపు ఉచితం
సాదాబైనామా కోసం 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 మధ్య దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో ఐదు ఎకరాల్లోపు ఉన్న వాటిని ఉచితంగా చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయించనున్నట్లు పేర్కొంది.
విలీన గ్రామాల్లో..
మున్సిపాలిటీల్లో (Municipalities) విలీనం అయిన గ్రామాల్లో సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు జీవో 77 జారీ చేసింది. అనేక గ్రామాలు మున్సిపల్, కార్పొరేషన్లలో కలిశాయి. దీంతో ఆయా గ్రామాల్లోని సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలా లేదా అని అధికారులు కొంతకాలంగా అయోమయంలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం విలీన గ్రామాల్లో దరఖాస్తులకు మోక్షం కలిగించేలా జీవో విడుదల చేసింది.
ఇది కూడా చదవండి : Bandi Sanjay Song | శ్రీరామనవమి సందర్భంగా పాటతో ఆకట్టుకున్న బండి సంజయ్

