అక్షరటుడే, కామారెడ్డి: POCSO Jail Sentence ఫోక్సో నిందితునికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.15 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఇటీవల జిల్లాలో ఫోక్సో కేసులపై కామారెడ్డి కోర్టు వరుసగా సంచలన తీర్పులు వెల్లడిస్తోంది. ఇప్పటికే ఫోక్సో కేసులలో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించగా తాజాగా మరో కేసులోనూ 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అంటే ఒకే నెలలో మూడు కేసుల్లోనూ ఒకే విధమైన తీర్పు ఇవ్వడం విశేషం.
POCSO Jail Sentence బాలికను వంచించి..
కామారెడ్డి జిల్లా గండిమాంసానిపేట గ్రామంలో ఫిబ్రవరి 25, 2025 న ఇంట్లో తనతో పాటే నిద్రించిన కూతురు తెల్లవారుఝామున 5 గంటలకు చూసేసరికి కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా గండి మాసానిపేట గ్రామానికి చెందిన చెర్ల ప్రశాంత్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. బాధిత బాలికకు నిందితుడు దూరపు బంధువు. కుటుంబ సమస్యల వల్ల ప్రశాంత్ తన భార్యతో విడిపోయి వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తమ బంధువుల్లోని పదో తరగతి చదువుతున్న బాధిత బాలికపై కన్నేశాడు. ఆమెను ప్రేమ, పెళ్లి పేరుతో లోబర్చుకున్నాడు. అనంతరం పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
POCSO Jail Sentence పోలీసులు గుర్తించి..
ఇదే క్రమంలో గతేడాది మార్చి 26వ తేదీ తెల్లవారుజామున బాలికను తీసుకుని హైదరాబాద్కు పారిపోయాడు. అక్కడ కూడా తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. చివరకు బాలికను గుర్తించిన పోలీసులు, ఆమెను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. పూర్తి ఆధారాలతో కోర్టులో హాజరుపర్చారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి డా.విఆర్ఆర్ వరప్రసాద్.. నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్తో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
