అక్షరటుడే, వెబ్డెస్క్: Temple Stampede Bihar | బీహార్ (Bihar)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లా (Nalanda District)లోని శీతల మాత ఆలయంలో మంగళవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు.
నలందాలోని శీతలా మాత ఆలయం (Sheetala Mata Temple)లో మంగళవారం కావడంతో భక్తులు పూజల కోసం తరలివచ్చారు. ప్రతి మంగళవారం ప్రార్థనల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. చైత్ర మాసంలోని చివరి మంగళవారం కావడంతో రద్దీ అధికంగా ఉంది. ఈ క్రమంలో ఆలయం లోపల అకస్మాత్తుగా గందరగోళం చెలరేగి, తొక్కిసలాట జరిగింది. ప్రజలు తప్పించుకునే ప్రయత్నంలో, తీవ్రమైన తొక్కిసలాటలో పలువురు మహిళలు నలిగి ప్రాణాలు కోల్పోయారు.
Temple Stampede Bihar | పలువురికి గాయాలు
ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సదర్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే, జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తొక్కిసలాటకు ఖచ్చితమైన కారణం ఇంకా అస్పష్టంగా ఉంది. ఆలయం వద్ద భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఘటన చోటు చేసుకుందని స్థానికులు ఆరోపించారు. కాగా ఈ ఆలయం బీహార్ షరీఫ్ (నలంద) నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఘ్రా గ్రామంలో ఉంది. ఇక్కడ చైత్ర మాసం (Chaitra Maasam)లోని కృష్ణ పక్ష అష్టమి (శీతలాష్టమి) సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తారు.
Temple Stampede Bihar | స్పందించిన హోంమంత్రి
తొక్కిసలాట ఘటన అత్యంత బాధాకరమని బీహార్ హోం మంత్రి సామ్రాట్ చౌదరి (Home Minister Samrat Choudhary) పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన భక్తుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: India Minimum Wage | వారి వేతనాల పెంపు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి!
