అక్షరటుడే, వెబ్డెస్క్ : Bhu Bharati portal | రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పడానికి సిద్ధమైంది. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఇంటిగ్రేటేడ్ భూ భారతి పోర్టల్ను గురువారం ప్రారంభించనుంది. ప్రయోగాత్మకంగా తొలుత దీనిని ఐదు మండలాల్లో అమలు చేయనున్నారు.
రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి (Ponguleti) తెలిపారు. రైతులకు పారదర్శకంగా, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ భూ భారతి పోర్టల్ తీసుకు వస్తున్నట్లు తెలిపారు.
Bhu Bharati portal | ప్రయోగాత్మకంగా..
భూ భారతి పోర్టల్ను ఈనెల 2 నుంచి రంగారెడ్డి (Rangareddy) జిల్లా అమన్గల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా కొస్గి, ఖమ్మం జిల్లా కూసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలాల్లో పోర్టల్ సేవలు ప్రారంభం కానున్నాయి. కేరళ పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి బుధవారం అధికారులతో భూ భారతిపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
Bhu Bharati portal | ఇంటి నుంచే సేవలు
రైతులు తమ భూ సేవల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి నుంచే సేవలు పొందేవిధంగా పోర్టల్ రూపొందించినట్లు పొంగులేటి తెలిపారు. రైతు లాగిన్ అయిన వెంటనే తన భూమి వివరాలు కనిపిస్తాయన్నారు. ఎన్నిఎకరాలకు సర్వే కావాలో ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలోని లైసెన్స్డ్ సర్వేయర్ లాగిన్కు వెళ్తాయని, ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెన్స్డ్ సర్వేయర్ ఖరారు చేసి రోవర్లతో సర్వే పూర్తి చేస్తారన్నారు.
భూభారతి చట్టంలో పేర్కొన్నవిధంగా వ్యవసాయ భూములకు సంబంధించి క్రయ విక్రయదారులకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేయనున్నారు.
దీనిని కూడా చదవండి : Ration Card Removal | రేషన్కార్డులు తొలగించే కుట్ర.. కవిత సంచలన వ్యాఖ్యలు
