అక్షరటుడే, వెబ్డెస్క్ : LDF Manifesto | కేరళం అసెంబ్లీ ఎన్నికలు (Kerala Assembly Elections) సమీపిస్తుండటంతో అధికార ఎల్డీఎఫ్ కూటమి తాజాగా మేనిఫెస్టో విడుదల చేసింది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.
కేరళ ముఖ్యమంత్రి, ధర్మడం నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి అయిన పినరయి విజయన్ (Pinarayi Vijayan) గురువారం మేనిఫెస్టోను విడుదల చేశారు. తాము గెలిస్తే సంక్షేమ పింఛనును రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామన్నారు. పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్య రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చి, కేరళంను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే తమ కూటమి లక్ష్యమని అన్నారు.
LDF Manifesto | కేంద్ర నిర్లక్ష్యం
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్లక్ష్యం వహిస్తోందని విజయన్ ఆరోపించారు. పదేళ్లలో రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ఈ మేనిఫెస్టో కేరళం సమగ్ర అభివృద్ధికి ఒక బ్లూప్రింట్ అని పేర్కొన్నారు. దీని ద్వారా, వ్యవసాయం, పరిశ్రమ, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో గణనీయమైన మార్పులు తీసుకు వస్తామని వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కోటి రూపాయల సగటు టర్నోవర్ కలిగిన సంస్థలుగా అప్గ్రేడ్ చేసేందుకు ‘మిషన్ లక్ష’ అనే పథకాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించింది.
LDF Manifesto | ఉపాధి హామీని కొనసాగిస్తాం
కేఎస్ఆర్టీసీ (KSRTC)ని లాభదాయకంగా మార్చడంతో పాటు, రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా చేస్తామని ఎల్డీఎఫ్ హామీ ఇచ్చింది. ఉపాధి హామీ పథకాన్ని గతంలో మాదిరిగానే కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఇది కూడా చదవండి..: Fertilizer Import Duty Removal | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎరువుల దిగుమతులపై సుంకాలు రద్దు
