అక్షరటుడే, వెబ్డెస్క్ : MIM Leader Arrest | ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌస్ కుమారుడు మహ్మద్ సాహిల్ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, అధికారుల విధులను అడ్డుకున్నందుకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఫుట్పాత్లపై ఆక్రమణలు తొలగించేందుకు ప్రతి శనివారం జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్న విషయం తెలిసిందే. శనివారం సైతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ క్రమంలో చార్మీనార్ సమీపంలో ఫుట్పాతలపై ఏర్పాటు చేసిన డబ్బాలు, షెడ్లను తొలగించేందుక పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ అధికారులు వెళ్లారు. వారిని ఎంఐఎం కార్పొరేటర్ కుమారుడు సాహిల్, నాయకులు అడ్డుకున్నారు.
MIM Leader Arrest | సోషల్ మీడియాలో వైరల్
ఎంఐఎం నాయకులు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసుల ఎదుటే జీహెచ్ఎంసీ సిబ్బందిపై దాడి చేశారు. జేసీబీ అద్దాలను ధ్వంసం చేశారు. జేసీబీలకు అడ్డం పడుకొని నిరసన తెలిపారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సామాన్యులు చిన్న తప్పులు చేస్తే కేసులు నమోదు చేసే పోలీసులు ఎంఐఎం నాయకులను ఏమి అనకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నాయకులు రెచ్చిపోతున్నా.. పోలీసులు సైలెంట్గా ఉండటంపై నెటిజన్లు మండిపడ్డారు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు (Hyderabad Police) చర్యలు చేపట్టారు.
MIM Leader Arrest | ఉద్రిక్తత
పోలీసులను తోసివేయడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని మహ్మద్ సాహిల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అధికారులను బెదిరించడంతో పాటు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఆయనను విచారణ నిమిత్తం ఠాణాకు తరలించారు. అరెస్ట్ సమయంలో చార్మినార్ (Charminar) పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.
దీనిని కూడా చదవండి : Hyderabad Land Scam | హైదరాబాద్లో రూ.7 వేల కోట్ల భూ కుంభకోణం.. హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు
