అక్షరటుడే, కామారెడ్డి: CT Scan Facility | సీటీ స్కాన్ యంత్రాన్ని టీ హబ్ భవనంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) వైద్యాధికారులకు సూచించారు. జీజీహెచ్ డెవలప్ మెంట్ సొసైటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, ఇతర అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
CT Scan Facility | 99శాతం పూర్తయిన పనులు..
ఆస్పత్రిలో చేపట్టిన పనుల్లో సుమారు 99శాతం పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. హెచ్డీఎస్ నిధుల ఆర్థిక స్థితిపై వివరాలు అందించారు. సుమారు రూ.18లక్షలు అందుబాటులో ఉండగా అందులో రూ.10 లక్షలు క్యాన్సర్ కేర్, పాలియేటివ్ సేవలకు కేటాయించగా, రూ.2 లక్షలు హాస్పిటల్ క్యాంటీన్ కాషన్ డిపాజిట్గా వినియోగించినట్లు తెలిపారు. మిగిలిన నిధులను పెండింగ్ పనుల కోసం పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ (Panchayat Raj Engineering Department) ద్వారా వినియోగించనున్నట్లు వివరించారు.
CT Scan Facility | ప్రసూతి కేసుల పెరుగుదల
కేసీఆర్ కిట్ (KCR Kit) అమలు తర్వాత ప్రసూతి కేసుల పెరుగుదలపై ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి వివరాలు కోరడంతో పాటు ట్రామా కేసుల వివరాలను ఇవ్వాలని సూచించారు. హాస్పిటల్లో సీటీ స్కాన్ సౌకర్యం లేకపోవడం వల్ల ట్రామా రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాల్సి వస్తోందని, ప్రస్తుత టీ-హబ్ భవనంలో సీటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు రాజన్న సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అందుబాటులో లేని విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. యంత్రం ఉన్నప్పటికీ ప్రతి యూనిట్కు సుమారు రూ.8వేలు వ్యయం అవుతుందని తెలపగా, దీనిపై ఇండెంట్ పంపించాలని, అవసరమైన సహాయం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
CT Scan Facility | కొత్త భవనంలోకి జీజీహెచ్..?
జీజీహెచ్ను కొత్త భవనానికి మార్చే విషయమై కలెక్టర్, ఎమ్మెల్యే చర్చించారు. మెడికల్ కాలేజ్ భవనం (Medical College Building) జూన్ నాటికి పూర్తయ్యే అవకాశముందని, కాలేజ్ అక్కడికి మారిన అనంతరం ప్రస్తుత ఎంసీహెచ్ భవనాన్ని ఆస్పత్రి కోసం వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణ కోసం టీఎస్ఎంఐడీసీ, ఆర్అండ్బీ ఇంజినీర్లు, ఆస్పత్రి సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, అదనపు కలెక్టర్, జిల్లావైద్యాధికారి, ఆర్డీవో, ఆర్ఎంవోలతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి ఒక వెంటిలేటర్ అందజేస్తామని రెడ్క్రాస్ సొసైటీ తరపున రాజన్న తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ, పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అత్యవసర సేవల విభాగాన్ని బలోపేతం చేయడం, అవసరమైన వైద్య పరికరాలను సమకూర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుమెహన్ (Additional Collector Madhumohan), ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాల్యా, ఆర్డీవో ఎన్ వై గిరి, అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: TGRJC Admissions 2026 | తెలంగాణ గురుకుల విద్యాలయంలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
