అక్షరటుడే, వెబ్డెస్క్: US Iran Talks | పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమయ్యాక అమెరికా -ఇరాన్ల మధ్య తొలిసారి చర్చలు జరగబోతున్నాయి. ఇప్పటికే రెండు వారాలపాటు కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరుపక్షాలు.. శుక్రవారం నుంచి పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరగబోతున్న చర్చల్లో పాల్గొనబోతున్నాయి.
ఈ చర్చలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. చర్చలు ఎలా జరుగుతాయని, ఇరు పక్షాలు డిమాండ్ల విషయంలో ఎలా స్పందిస్తాయి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయా అన్న విషయాలపై ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
US Iran Talks | ఎన్నో అనుమానాలు..
సీజ్ ఫైర్ (Cease Fire)కు ఇరు పక్షాలు అంగీకరించినా.. ఉల్లంఘనలు జరుగుతున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడంతో తాము చర్చలనుంచి వైదొలగుతామని ఇరాన్ పేర్కొంది. హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)ని తిరిగి మూసివేయడానికీ సిద్ధపడింది. మరోవైపు చర్చల ఫలితం తేలేదాకా తమ బలగాలను ఉపసంహరించబోమని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ (US President Trump) స్పష్టం చేశారు. దీంతో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. అయితే లెబనాన్తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Israel PM Netanyahu) ప్రకటించడం ఊరటనిచ్చే విషయం. అమెరికా వేదికగా ఇరు దేశాల మధ్య వచ్చే వారం చర్చలు జరగొచ్చని భావిస్తున్నారు.
US Iran Talks | చర్చల్లో పాల్గొనేదెవరంటే..
ఇస్లామాబాద్లో జరిగే చర్చల్లో ఇరు దేశాలనుంచి ముగ్గురు చొప్పున ప్రతినిధులు పాల్గొననున్నారు. అమెరికా తరఫున ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, పశ్చిమాసియా వ్యవహారాల ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు, మాజీ సలహాదారుడు జేర్డ్ కుష్నర్, ఇరాన్ నుంచి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘెర్ ఘాలిబఫ్, విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ, ఇరాన్ సైన్యం ప్రతినిధి ఒకరు పాల్గొంటారు.
US Iran Talks | చర్చలు ఇలా..
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) ఉభయపక్షాలతో విడివిడిగా ప్రాథమిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. చర్చల సమయంలో అమెరికా, ఇరాన్ బృందాలు వేరువేరు గదుల్లో కూర్చోనున్నారు. పాక్ అధికారులు వీరి మధ్య రాయబారులుగా ఉంటూ ఒకరి సందేశాన్ని మరొకరికి చేరవేయనున్నారు. ఇరాన్ అణు కార్యక్రమం, 10 పాయింట్ల ఫార్ములా, హార్మూజ్ జలసంధి తెరిచి ఉంచడంపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Hormuz Strait | హర్ముజ్ను మళ్లీ మూసివేసిన ఇరాన్.. వార్నింగ్ ఇచ్చిన ట్రంప్
