అక్షరటుడే, కామారెడ్డి: Accident on NH44| ఆస్పత్రిలో కోలుకున్నా మృత్యువు ఆమెను వీడలేదు. ప్రైవేట్ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. తెల్లవారితే ఇంటికి చేరుకునే మధ్యలోనే అనంత లోకాలకు చేరుకుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న అంబులెన్సును కాశీకి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో అంబులెన్స్ డ్రైవర్, పేషంట్ మృతి చెందిన ఘటన భిక్కనూరు రామేశ్వర్ పల్లి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..
Accident on NH44 | హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా…
ఆదిలాబాద్ కు చెందిన షైఫుల్లా ఖాన్ తన భార్య సలెహా భానును హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఓ ప్రైవేట్ అంబులెన్సులో ఆదిలాబాద్ కు అర్ధరాత్రి సుమారు 12:30 గంటల ప్రాంతంలో బయలుదేరారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో అంబులెన్స్ బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి జాతీయ రహదారి వద్దకు రాగానే వెనక నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు అంబులెన్సును బలంగా ఢీకొంది. ఈ ఘటనలో అంబులెన్సులో ఉన్న పేషంట్ సలేహా భాను(60), డ్రైవర్ షేక్ సర్దార్(35) అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి భర్త షైఫుల్లా ఖాన్ కు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి.
Accident on NH44 |జీజీహెచ్ కు తరలింపు
విషయం తెలుసుకున్న భిక్కనూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పక్కకు తప్పించారు. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని మృతదేహాలతో పాటు గాయపడిన వ్యక్తి ని జీజీహెచ్ కు తరలించారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Revanth Reddy Comments | జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించనంటూనే.. ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డ సీఎం రేవంత్!
