అక్షరటుడే, వెబ్డెస్క్: Iran Peace Talks | పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య, అమెరికా (America) తో శాంతి చర్చల కోసం ఇరాన్ చేపట్టిన తాజా ప్రయత్నం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చర్చల కోసం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్కు బయలుదేరిన ఇరాన్ ప్రతినిధి బృందం, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల జ్ఞాపకాలను తమ వెంట తీసుకెళ్లడం విశేషం.
ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని ఈ బృందం విమానంలో రక్తంతో తడిసిన స్కూల్ బ్యాగులు, చిన్నారుల బూట్లు, తెల్ల గులాబీలు, అలాగే మినాబ్ స్కూల్ బాధితుల ఫోటోలను ముందువరుసలో ఏర్పాటు చేసింది. ఈ దృశ్యాలు యుద్ధం వల్ల కలిగిన మానవ నష్టాన్ని ప్రపంచానికి గుర్తుచేస్తున్నాయి.
Iran Peace Talks | ‘మినాబ్ 168’గా ప్రతినిధి బృందానికి పేరు
ఘాలిబాఫ్ ఈ ఫోటోను సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేస్తూ.. నా విమానంలో 168 మంది మినాబ్ సహచరులు ఉన్నారు అంటూ భావోద్వేగానికి గురయ్యేలా వ్యాఖ్యానించారు. ఈ చర్య ద్వారా యుద్ధం కేవలం రాజకీయ సంఘర్షణ కాదని, అమాయకుల ప్రాణాలను బలిగొంటున్న మానవ విషాదమని ప్రపంచానికి చాటి చెప్పాలన్నదే వారి ఉద్దేశంగా తెలుస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మినాబ్ ప్రాంతంలోని పాఠశాలపై జరిగిన భీకర దాడిలో 168 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఆ చిన్నారుల జ్ఞాపకార్థం ప్రతినిధి బృందానికి “మినాబ్ 168” అనే పేరు పెట్టారు.దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం కూడా ఈ ఘటనపై స్పందిస్తూ “మినాబ్ పిల్లలను మేమెప్పటికీ మర్చిపోము” అని పేర్కొంది.
Iran Peace Talks | పెద్ద సంఖ్యలో చిన్నారులు మృతి
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury)పేరుతో జరిగిన దాడుల్లో మినాబ్లోని షజరే తాయెబే బాలికల ప్రాథమిక పాఠశాల లక్ష్యంగా మారింది. పాఠశాల నడుస్తున్న సమయంలో జరిగిన ఈ దాడిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు మృతి చెందడం ప్రపంచాన్ని కలిచివేసింది. పౌర ప్రాంతాలు, ముఖ్యంగా పాఠశాలలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ మానవతా చట్టాలకు వ్యతిరేకమని నిపుణులు తీవ్రంగా ఖండిస్తున్నారు.ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, ఇది “క్రూరమైన హత్య” అని పేర్కొన్నారు. చిన్నారుల సామూహిక సమాధుల ఫోటోలను పంచుకుంటూ, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఈ శాంతి చర్చలు యుద్ధానికి ముగింపు పలుకుతాయా లేదా అన్నదానిపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. యుద్ధం వల్ల నష్టపోయిన అమాయకుల ప్రాణాలను గుర్తుచేస్తూ ఇరాన్ తీసుకున్న ఈ ప్రతీకాత్మక చర్య ప్రపంచాన్ని కదిలిస్తోంది.
ఇది కూడా చదవండి..: Iran US Ceasefire | ఇరాన్ కండీషన్లకు ఒప్పుకున్న అమెరికా
