అక్షరటుడే, వెబ్డెస్క్: Travel Advisory | యూఎస్, ఇరాన్ల మధ్య చర్చలలో పురోగతి లేకపోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఏ క్షణమైనా ఇరాన్పై అమెరికా దాడి చేయవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇరాన్లో ఉన్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలంటూ తాజాగా అడ్వైజరీని జారీ చేసింది.
Travel Advisory | దాడి సంకేతాల నేపథ్యంలో..
ఒమన్ మధ్యవర్తిత్వంలో అమెరికా, ఇరాన్ మధ్య రెండు విడతలుగా జరిగిన అణు చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. అనంతరం డొనాల్డ్ ట్రంప్, ఆయతుల్లా అలీ ఖమేనీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో పశ్చిమాసియా మరింత వేడెక్కింది. అణు చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడికి వెనుకాడబోమని యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే సంకేతాలిచ్చారు. అగ్రరాజ్యం తన యుద్ధ నౌకలు, విమానాలను మధ్యప్రాచ్యానికి తరలించి మోహరించింది. అణు ఒప్పందం విషయంలో ఇరాన్ అధినేత ఆయతుల్లా అలీ ఖమేనీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. జెనీవాలో చర్చలు మూడు గంటల్లోనే ముగిసిన తర్వాత.. ఇరాన్ హర్మూజ్ జల సంధిని తాత్కాలికంగా మూసివేసి, క్షిపణి విన్యాసాలు నిర్వహించింది. ఇలా ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలోనే టెహ్రాన్లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. అక్కడి యూనివర్సిటీల విద్యార్థులు నిరసనలు చేపట్టారు.
Travel Advisory | అప్రమత్తంగా ఉండాలి
ఇరాన్లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మళ్లీ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్లో నెలకున్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న భారత ప్రభుత్వం తొలి అడ్వైజరీని జారీ చేసిన విషయం తెలిసిందే. భారత పౌరులు సురక్షిత ప్రాంతాలలో ఉండాలని సూచించింది. దానికి కొనసాగింపుగా గతనెల 14న మరో అడ్వైజరీని వెలువరించింది. తాజాగా మరో అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారత పౌరులు (విద్యార్థులు, పర్యటకులు, వ్యాపారవేత్తలు, యాత్రికులు) అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాల ద్వారా తక్షణమే ఇరాన్ను వీడాలని పేర్కొంది. భారతీయులు, భారత సంతతికి చెందినవారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. నిరసనలు, ఆందోళనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, ఇరాన్లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని, పాస్పోర్ట్లు, గుర్తింపు కార్డులతో సహా తమ ప్రయాణ, ఇమిగ్రేషన్ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఈ విషయంలో ఎలాంటి సహాయం కోసమైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని అడ్వైజరీలో పేర్కొంది.
ఇది కూడా చదవండి..: Trump Tariffs Suspension | సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. రేపటి నుంచి ట్రంప్ టారిఫ్లు నిలిపివేత

