అక్షరటుడే, వెబ్డెస్క్: Iran US Conflict | ఇజ్రాయెల్ – అమెరికా దాడులతో ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ను ఒమన్, యూఏఈల నుంచి వేరు చేసే ఈ హార్ముజ్ జలసంధి నుంచే ప్రపంచ చమురు వాణిజ్యంలో 20 శాతం సాగుతోంది. భారత్ తన ముడి చమురు దిగుమతులు, చమురు ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఎక్కువగా ఈ మార్గంపైనే ఆధారపడుతోంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని మూసి వేస్తే చమురు, సరుకుల రవాణా నిలిచిపోయే అవకాశాలున్నాయి. దీంతో ఇంధన, సరుకు రవాణా వ్యయాలు పెరుగుతాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు అదనపు భారం కానుంది.
Iran US Conflict | భారత్కు కీలకం..
అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారతదేశం రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించి, మధ్యప్రాచ్య దేశాలనుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. 2025 చివరి నాటికి హార్ముజ్ జలసంది మీదుగా 40 శాతంగా ఉన్న భారత చమురు దిగుమతులు.. 2026 జనవరి-ఫిబ్రవరి నాటికి 50 శాతానికి పెరిగాయి. ప్రస్తుతం భారత్ రోజుకు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇది హార్ముజ్ జలసంధి నుంచే వస్తోంది. అలాగే సగటున రోజుకు 74 వేల బ్యారెళ్ల శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను భారత్ ఈ జలసంధి నుంచే ఎగుమతి చేస్తోంది. జియో పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో ఈ జలసంధిని మూసివేస్తే రవాణా ఖర్చులు తడిసి మోపెడయ్యే అవకాశాలున్నాయి. ఎర్ర సముద్రంలో భద్రత లేకపోతే నౌకలు ఆఫ్రికా మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల సరకు రవాణా సమయం రెండు నుంచి మూడు వారాలు, ఖర్చులు 50 శాతం వరకు పెరిగే అవకాశాలుంటాయి. ఇది భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది.
Iran US Conflict | చమురు ధర మరింత పెరిగే అవకాశం
అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల (Iran US Conflict) నేపథ్యంలో కొంతకాలంగా ముడి చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాల మోహరింపుతో ముడిచమురు ధరలు సుమారు 10 శాతం పెరిగాయి. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా జరుపుతున్న దాడుల నేపథ్యంలో చమురు ఉత్పత్తికి అంతరాయం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ రోజుకు 33 లక్షల బ్యారెళ్ల ఇరాన్ చమురు ఉత్పత్తికి అంతరాయం కలిగితే బ్యారెల్ ధర 15 శాతం వరకు పెరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. హార్ముజ్ జలసంధికి పాక్షిక ఆటంకం ఏర్పడితే ధర మరింత పెరిగి బ్యారెల్కు వంద డాలర్లు దాటవచ్చన్న అభిప్రాయమూ అనలిస్టుల్లో వ్యక్తమవుతోంది.
Iran US Conflict | పసిడి పరుగులు..
అంతర్జాతీయంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పుడు ఈక్విటీ మార్కెట్లు తీవ్రంగా నష్టపోతుంటాయి. ఈ నేపథ్యంలో మదుపరులు సురక్షిత పెట్టుబడి మార్గాలపై ఆసక్తి చూపుతుంటారు. వివిధ దేశాల మధ్య నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్తో ఇప్పటికే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అమెరికా, ఇరాన్ పరస్పర దాడుల నేపథ్యంలో మళ్లీ బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. వరుసగా మూడో రోజూ ఆయా లోహాల ధరలు పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 4,370 పెరిగి, రూ. 1,73,080కి చేరింది. స్వచ్ఛమైన వెండి కిలో ధర రూ. 5 వేలు పెరిగి రూ. 3.25 లక్షలు దాటింది.
ఇతర రంగాలపైనా ప్రభావం..
భారత్ చమురు దిగుమతులపై ఆధారపడి ఉంది. మనం వినియోగించే చమురులో 85 శాతం ఇతర దేశాల నుంచే వస్తోంది. ప్రస్తుత జియో పొలిటికల్ టెన్షన్స్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కొద్దిగా పెరిగినా మనపై భారం పడుతుంది. చమురు ధరలు పెరిగితే దిగుమతి బిల్లు భారీగా పెరిగి, కరెంట్ ఖాతా లోటు మరింత ఎక్కువవుతుంది. రూపాయి విలువ మరింత ఒత్తిడిని ఎదుర్కోనుంది.
భారత్ నుంచి ఇరాన్కు ఎగుమతి అయ్యే వస్తువులపైనా ప్రభావం పడుతుంది. ప్రధానంగా బియ్యం, మందులు, టీ, సుగంధద్రవ్యాలు తదితర వస్తువుల ఎగుమతులపై ప్రభావం ఉండే అవకాశాలున్నాయి.
ఇరాన్, ఇజ్రాయిల్, గల్ఫ్ తదితర దేశాల గగనతలాలను పాక్షికంగా మూసివేశారు. దీంతో విమాన సర్వీసుల రూట్లను మళ్లించాల్సి వస్తోంది. ఫలితంగా విమాన టిÂకెట్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
స్టాక్మార్కెట్పైనా ఒత్తిడి..
అమెరికా ఆంక్షలతో ఇప్పటికే కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో మరింత దెబ్బతినే అవకాశాలున్నాయి. ప్రధానంగా ఇరాన్కు వస్తువులను ఎగుమతి చేసే కంపెనీలు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోనున్నాయి. చమురు ఉత్పత్తుల కంపెనీలకూ ఇది ఇబ్బందికర పరిస్థితిని కల్పించనుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఎంత త్వరగా తగ్గితే మన మార్కెట్లకు అంత మేలు జరుగుతుందన్న అభిప్రాయాన్ని అనలిస్టులు వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Ali Khamenei Death | ఇస్లామిక్ విప్లవ సుప్రీం లీడర్ ఖమేనీ.. నాలుగు దశాబ్దాలుగా అధికారం

