అక్షరటుడే, వెబ్డెస్క్ : India Oil Reserves | దేశంలో చమురు నిల్వలపై కేంద్ర ప్రభుత్వం (Central Government) క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం 250 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు, రిఫైన్డ్ పెట్రోలియం నిల్వలు ఉన్నాయని వెల్లడించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేతతో భారత్కు పెట్రోలియం దిగుమతులు తగ్గాయి. దీంతో దేశంలో పెట్రోలు నిల్వలు తక్కువగా ఉన్నాయని, ఇవి 25 రోజులకు మాత్రమే సరిపోతాయని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దేశ అవసరాలకు దాదాపు 7 నుంచి 8 వారాల వరకు సరిపోయే నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
India Oil Reserves | పలు కేంద్రాల్లో..
దేశంలోని మంగళూరు, పడూర్, విశాఖపట్నంలోని వ్యూహాత్మక కేంద్రాలతో పాటు పైప్లైన్లు నౌకల్లో ఈ నిల్వలను భద్రపరిచినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి చమురు దిగుమతులు తగ్గాయి. ప్రభుత్వం రష్యా నుంచి దిగుమతులను పెంచింది. దీంతో దేశంలో చమురు నిల్వలకు ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నారు.

India Oil Reserves | ధరలు పెరుగుతాయా..
ప్రస్తుతం ముడి చమురు (Crude Oil) ధరలు భారీగా పెరిగాయి. దీంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రేట్లు పెంచే ఆలోచన చేయడం లేదని సమాచారం. పెట్రోలియం కంపెనీలనే నష్టాలను భరించాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సామాన్యులపై భారం పడే అవకాశం లేదు. త్వరలో రేట్లు తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) పేర్కొన్నారు. ధరలు తగ్గకపోతే మాత్రం పెట్రోలియం సంస్థలు ఆ భారాన్ని ప్రజలపై మోపే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ఛాన్స్ ఉంది.
ఇది కూడా చదవండి..: President protocol controversy | రాష్ట్రపతి ప్రొటోకాల్ వివాదం.. టీఎంసీపై ప్రధాని ఆగ్రహం

