అక్షరటుడే, ఇందూరు: Sand Illegal Transport | నిజామాబాద్ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో ఇసుక అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా అనుమతులు తీసుకొని రవాణా చేసుకోవాలని వినియోగదారులకు కలెక్టర్ సూచించారు.
Sand Illegal Transport | జిల్లాలో 25 ఇసుక రీచ్లు
‘మన ఇసుక వాహనం’ యాప్లో 25 ఇసుక రీచ్లు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. నూతనంగా బోధన్, నవీపేట్, నిజామాబాద్లో కూడా త్వరలో సాండ్ బజార్ అందుబాటులోకి రానుందని చెప్పారు.
ఇందిరమ్మ ఇళ్లకు, ఇతర అవసరాలకు తప్పనిసరిగా అందుబాటులో ఉన్న ఇసుక పాయింట్ల ద్వారా ఇసుకను పొందాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరూ ఇసుక తవ్వకాలు చేపట్టరాదని, రవాణా చేయకూడదని స్పష్టం చేశారు. దీనిపై కఠిన నిఘా కొనసాగుతుందని తెలిపారు.
ఇప్పటివరకు మన ఇసుక వాహనం యాప్ ద్వారా సుమారు 4,766 ట్రిప్పుల ఇసుక బుకింగ్ జరిగిందని కలెక్టర్ తెలిపారు. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 34 లక్షల ఆదాయం సమకూరిందని వెల్లడించారు.
ప్రతి ఒక్కరు ఇసుక అవసరాల కోసం మన ఇసుక వాహనం ఆన్లైన్ యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ తవ్వకాలు లేదా రవాణా చేయకూడదని కలెక్టర్ గట్టిగా హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

