అక్షరటుడే, వెబ్డెస్క్: Temple Circuit | బాసర నుంచి భద్రాచలం వరకు ఒక టెంపుల్ సర్క్యూట్గా ఆలయాలను అభివృద్ధి చేస్తామని మంత్రులు తెలిపారు. గోదావరి పుష్కరాల నిర్వహణపై కేబినెట్ సబ్ కమిటీ మంగళవారం భేటీ అయింది. మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఆధ్యాత్మిక వైభవంతో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల అభివృద్ది, వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి సబ్ కమిటీ అధికారులతో చర్చించింది. పుష్కరాల నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం (Basara to Bhadrachalam) వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాలు, పురాతన ఆలయాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను కమిటీ సూచించింది.

Temple Circuit | భద్రాచలం మాస్టర్ ప్లాన్
బాసర ఆలయానికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఆమోదం ఉందని, భద్రాచలం దేవస్ధానం మాస్టర్ ప్లాన్ను కూడా కమిటీలో చర్చించి సీఎం ఆమోదం తీసుకోవాలని మంత్రులు నిర్ణయించారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి సమగ్ర రోడ్ల అనుసంధానం కల్పించే విధంగా, ముఖ్యంగా గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతుల ఏర్పాట్లతో పాటు పుష్కర ఘాట్ల అభివృద్ధి, రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, రవాణా తదితర సౌకర్యాలపై చర్చించారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kavitha Siddipet Contest | సిద్ధిపేట నుంచి కల్వకుంట్ల కవిత పోటీకి దిగనుందా.. నెట్టింట వైరల్!

