అక్షరటుడే, వెబ్డెస్క్ : Kavitha Land Protest | రాష్ట్ర ప్రభుత్వం పేదల భూములను కబ్జా చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. ఖమ్మం (Khammam) జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని ఆమె జాగృతి కార్యాలయంలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. కూల్చిన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.
భూదాన్ భూములను ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని కవిత ప్రశ్నించారు. వెలుగుమట్లలో భూముల రేట్లు పెరగటంతో పేదల ఇళ్లు కూల్చి ఆ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్లు కూల్చేస్తూ అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. వెలుగుమట్లలో భూదాన్ భూమి 30 ఎకరాలు ఉందని, ఆక్రమణకు గురైన మరో 30 ఎకరాల భూమి ఉందన్నారు.
Kavitha Land Protest | పరీక్షల సమయంలో..
టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉండే ఇలాంటి సమయంలో అర్ధరాత్రి బుల్డోజర్లతో 750 ఇళ్లను కూలగొట్టారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను అంబేడ్కర్ భవన్లో ఉంచారన్నారు. అక్కడ కనీస వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు ఎన్నో ఏళ్లు కష్టపడి ఇళ్లు కట్టుకుంటే నిమిషాల్లో కూల్చేశారన్నారు. బాధితులకు భోజనం కూడా పెట్టడం లేదన్నారు.
Kavitha Land Protest | అక్రమంగా అరెస్ట్
బాధితులకు న్యాయం చేయాలని సోమవారం రాత్రి నుంచి దీక్ష కొనసాగిస్తుంటే ఇవాళ ఉదయం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ధర్మ సమాజ్ పార్టీ (DSP) అధ్యక్షుడు విశారదన్ను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదన్నారు. భూదాన్ బోర్డు పేదలకు ఇచ్చిన స్థలాలకు పట్టాలు కూడా ఇచ్చిందని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి కాని చోట నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు.

