అక్షరటుడే, వెబ్డెస్క్ : Petrol Gas Shortage India | దేశంలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) అన్నారు. పార్లమెంట్లో గురువారం ఆయన మాట్లాడారు. గ్యాస్ ఉత్పత్తిని పెంచమని కంపెనీలను ఆదేశించినట్లు వెల్లడించారు. ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
గ్యాస్ బుకింగ్లలో పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సరఫరా అంతరాయాలపై ప్రజల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పార్లమెంటులో ప్రకటన చేశారు. దేశీయ LPG ఉత్పత్తి పెరిగిందని, డెలివరీ సిస్టం ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని, అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయొద్దని కోరారు. హార్ముజ్ జలసంధికి సంబంధించిన దౌత్యపరమైన సున్నితత్వాల కారణంగా కొన్ని సరఫరా వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, అదనపు LPG సరఫరాలను పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి పురి తెలిపారు.
Petrol Gas Shortage India | మన నౌకలు సేఫ్
హార్మూజ్ జలసంధి (Strait of Hormuz)లోని 28 భారత నౌకలు సేఫ్గా ఉన్నాయని మంత్రి తెలిపారు. గ్యాస్ సంక్షోభాన్ని నివారించడంలో రాష్ట్రాలే కీలకం అన్నారు. బ్లాక్ మార్కెట్ను రాష్ట్రాలే నిరోధించాలని సూచించారు. ప్రతిరోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామని తెలిపారు. హార్ముజ్ నుంచి రవాణా నిలిచిపోవడంతో అనేక దేశాలపై ప్రభావం పడిందన్నారు. భారత్పై సైతం ప్రభావం పడినా.. ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయని తెలిపారు. పొరుగున ఉన్న దేశం రెండు వారాల పాటు అన్ని పాఠశాలలను మూసివేసిందని ఆయన పేర్కొన్నారు. మరొక పొరుగు దేశం విశ్వవిద్యాలయాలను ముందుగానే మూసివేసిందన్నారు. భారత్లో మాత్రం సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు.
Petrol Gas Shortage India | ఇతర మార్గాల ద్వారా..
భారతదేశ ముడి చమురు సరఫరా స్థానం సురక్షితంగా ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. గతంలో దాదాపు 45 శాతం క్రూడ్ ఆయిల్ హార్ముజ్ మార్గం ద్వారా రవాణా అయ్యేదన్నారు. ప్రస్తుతం ఇతర మార్గాల ద్వారా 70 శాతానికి దిగుమతులు పెరిగాయని వెల్లడించారు. దేశంలో పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ATF లేదా ఇంధన చమురు కొరత లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
దీనిని కూడా చదవండి : India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల రక్షణపై దృష్టి సారించిన కేంద్రం..

