హైదరాబాద్: ముంబై వేదికగా ఇందిరా ఐవీఎఫ్ సంస్థ నిర్వహించిన ఒక విస్తృత అధ్యయనంలో గాలి నాణ్యతకు పురుషుల వంధ్యత్వానికి మధ్య ఉన్న విడదీయలేని సంబంధం బయటపడింది. ముఖ్యంగా పారిశ్రామిక నగరాల్లో వాయు కాలుష్య సూచీ (AQI) 151 మార్కును దాటిన ప్రాంతాల్లో నివసించే వారిలో ఆరోగ్యకరమైన వీర్య కణాల సమగ్రత 11 శాతం మేర క్షీణిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.
పర్యావరణంలోని విషతుల్యాలు వీర్య కణాలలోని డీఎన్ఏ నిర్మాణాన్ని ఏ విధంగా దెబ్బతీస్తాయనే అంశంపై ఈ పరిశోధన సాగింది. గాలిలో కాలుష్య కారకాలు పెరిగే కొద్దీ వీర్య కణాల్లో డీఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ (కణాలు విచ్ఛిన్నం కావడం) పెరుగుతుందని, దీనినే పరిశోధకులు “పొల్యూషన్ బయాస్” అని నామకరణం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల ప్రకారం విశ్లేషించిన ఈ డేటా ప్రకారం, కాలుష్యం తక్కువగా ఉన్న చోట (AQI 50-100) 69.3 శాతం వీర్య కణాలు క్షేమంగా ఉన్నాయని, అయితే కాలుష్యం పెరుగుతున్న కొద్దీ ఈ సంఖ్య వేగంగా తగ్గుతోందని తేలింది. మధ్యస్థ కాలుష్య ప్రాంతాల్లో 8.8 శాతం మేర నష్టం వాటిల్లుతుండగా, తీవ్ర కాలుష్యం ఉన్న చోట ఆ నష్టం 11 శాతానికి చేరుతోంది.
ఈ అధ్యయనం గురించి ఇందిరా ఐవీఎఫ్ హాస్పిటల్ లిమిటెడ్ సీఈఓ డాక్టర్ క్షితిజ్ ముర్డియా స్పందిస్తూ, వాయు కాలుష్యం కేవలం సంతానోత్పత్తిని తగ్గించడమే కాకుండా, కాబోయే బిడ్డ (పిండం) ఎదుగుదలపై కూడా దుష్ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఉన్న తమ 120 కేంద్రాల ద్వారా 21 నుండి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 3,222 మంది పురుషులపై ఈ పరీక్షలు నిర్వహించినట్లు సంస్థ క్లినికల్ అండ్ ల్యాబ్ ఆపరేషన్స్ చీఫ్ డాక్టర్ విపిన్ చంద్ర పేర్కొన్నారు. సాధారణంగా చేసే వీర్య కణాల గణన కంటే, కణాల అంతర్గత జన్యు నిర్మాణం (DNA Integrity) ఎంతవరకు దెబ్బతిన్నదనే అంశంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించామని ఆయన వివరించారు. పెరుగుతున్న గాలి కాలుష్యం పురుషుల సంతానలేమి సమస్యలకు ఒక ప్రధాన కారకంగా మారుతోందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.

