అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Terror Links | తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad)లో ఉగ్రవాద లింకులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధం ఉన్నట్లు అనుమానంతో సయిదా బేగం అనే మహిళను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్, ఇటీవల విజయవాడలో బయటపడిన ఉగ్రలింకుల కేసుతో సంబంధం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Hyderabad Terror Links | నగరంలో గాలింపు చర్యలు
ఇంతకుముందు విజయవాడ (Vijayawada)లో మహమ్మద్ రహమతుల్లా, డానిష్, సొహైల్ బేగ్ అనే ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి విచారణలో వెల్లడైన సమాచారం ఆధారంగా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్లో కూడా ఈ నెట్వర్క్ కార్యకలాపాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు నగరంలో గాలింపు చర్యలు చేపట్టి సయిదా బేగంను పట్టుకున్నారు. ఆమెను స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో విచారించి, మరింత దర్యాప్తు కోసం విజయవాడకు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Hyderabad Terror Links | దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్వర్క్
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ఉగ్రలింకుల నెట్వర్క్ పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్ , మహారాష్ట్ర, అలాగే ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నట్లు తేలింది. సుమారు 12 మంది సభ్యులతో కూడిన ఈ గ్యాంగ్ సోషల్ మీడియా ద్వారా గుప్తంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇన్స్టాగ్రామ్ (Instagram)లో “అల్ మాలిక్ ఇస్లామిక్ యూత్” పేరుతో గ్రూప్ను నిర్వహిస్తూ, అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. గతంలో గుజరాత్ ATS అరెస్టుల తర్వాత ఈ నెట్వర్క్ మరింత జాగ్రత్తగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.
ఈ గ్యాంగ్ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై అధికారులు ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారిని ప్రశ్నిస్తూ మిగతా సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. ముఖ్య నగరాల్లో నిఘా పెంచడంతో పాటు, అనుమానాస్పద సోషల్ మీడియా (Social Media) అకౌంట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థలు సమన్వయంతో ఈ కేసును పరిశీలిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: Indigo Emergency Landing | ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

