అక్షరటుడే, వెబ్డెస్క్: AI Toll Collection | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సంచలనాలు సృష్టిస్తోంది. దీని వల్ల ఓవైపు పని సులువు అవుతుండగా.. మరోవైపు ఉద్యోగాలు ఊడుతాయన్న భయాలు పెరుగుతున్నాయి. అయితే ఇది పలు కంపెనీలపై కనకవర్షాన్ని కురిపిస్తోంది. ప్రభుత్వానికి సైతం మేలు జరుగబోతోంది.
ఇటీవల కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Minister Nitin Gadkari) ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. భారతదేశం పూర్తిగా డిజిటలైజ్డ్, అవరోధ రహిత టోలింగ్ వ్యవస్థ వైపు పయనిస్తోందని పేర్కొన్న ఆయన.. నూతన విధానం వల్ల దేశంలో టోల్ వసూళ్లు (Toll Collections) త్వరలో ఏటా రూ. 3.5 నుంచి 4 లక్షల కోట్ల వరకు పెరగవచ్చన్నారు. ప్రస్తుతం ఇది సంవత్సరానికి రూ. 80 వేల కోట్లుగా ఉంది. అంటే టోల్ వసూళ్లు నాలుగింతలపైనే పెరిగే అవకాశాలున్నాయి.
AI Toll Collection | ఆటోమెటిక్ గా టోల్ కట్..
ఈ ఏడాది చివరి నాటికి మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో వ్యవస్థను అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది ఏఐ (కృత్రిమ మేధస్సు) ఆధారిత టోల్ వ్యవస్థ. దీని వల్ల భౌతిక టోల్ ప్లాజాల అవసరం ఉండదు. వాహనాలు ఆగకుండానే, బ్యారియర్ లేకుండానే టోల్ చెల్లింపులు జరుగుతాయి. నంబర్ ప్లేట్ గుర్తింపు, ఫాస్టాగ్ ఇంటిగ్రేషన్ (FASTag Integration), ఏఐ సాంకేతికతల ద్వారా ఆటోమేటిక్గా టోల్ కట్ అవుతుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం, ఆటోమొబైల్ రంగం విస్తరించడం, రహదారులపై ట్రాఫిక్ పెరగడం వంటి కారణాలతోపాటు ఏఐ ఆధారిత వ్యవస్థ వల్ల ఈ ఏడాది చివరి నాటికి టోల్ వసూళ్లు భారీగా పెరుగుతాయని గడ్కరీ అంచనా వేస్తున్నారు.
AI Toll Collection | ప్రయోజనాలు..
టోల్ ప్లాజా (Toll Plaza)ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఇది వాహనదారులకూ సౌకర్యంగా ఉంటుంది.ఇంధనం ఆదా అవుతుంది. భౌతిక టోల్ ప్లాజాలు ఎత్తివేయడం వల్ల ఏటా సుమారు రూ. 1,500 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని భావిస్తున్నారు.టోల్ ఎగవేతలు తగ్గి, వసూళ్లు పెరిగే అవకాశాలుంటాయి. కొత్త విధానం అమలు తర్వాత ఏటా అదనంగా రూ. 6 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా.
AI Toll Collection | ఈ ఏడాది చివరి నాటికి..
దేశవ్యాప్తంగా ఈ ఏఐ ఆధారిత బ్యారియర్ ఫ్రీ టోల్ సిస్టమ్ 2026 చివరి నాటికి 100 శాతం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రోడ్డు ప్రాజెక్టులు విస్తరించడం, హైవేలపై ట్రాఫిక్ పెరగడం, డిజిటల్, లీక్ ప్రూఫ్ టోలింగ్ వ్యవస్థ అమలు చేయడం వల్ల ఈ లక్ష్యం సాధ్యమవుతుందని గడ్కరీ పేర్కొంటున్నారు. ఈ మార్పులు ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయని, ఇది ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి..: Kerala Elections | కేంద్ర నిధులను లెఫ్ట్ పార్టీ లూటీ చేసింది : ప్రధాని మోదీ
