అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Anti Drug Awareness | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi), పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లాస్థాయి సమావేశం జరిగింది.
Anti Drug Awareness | కలెక్టర్, సీపీ దిశానిర్దేశం..
మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. గడిచిన రెండు నెలల్లో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల (Police Department) ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు.
Anti Drug Awareness | అవగాహన కల్పించాలి
డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలను చైతన్యపర్చేందుకు విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రహరీ క్లబ్స్, యాంటీ డ్రగ్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను (Education Department Officials) ఆదేశించారు. ఈ కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తిస్థాయిలో అవి పనిచేసేలా చూడాలన్నారు. కొంతమంది గర్భిణులు సైతం క్లోరోఫాం, డైజోఫాం, అల్ఫ్రాజోలం వంటి హానికారకమైన పదార్థాలను వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కల్లు సేవిస్తున్నట్లు సమాచారం ఉందని, ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుందన్నారు.
Anti Drug Awareness | విస్తృత తనిఖీలు
గర్భిణులు కల్తీకల్లు బారిన పడకుండా గ్రామగ్రామాన అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధాన రహదారుల పక్కన దాబాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. తద్వారా ఓపీఎం (నల్లమందు) వంటి వాటి వినియోగాన్ని గుర్తించి నియంత్రించవచ్చని సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చూడాలన్నారు.
Anti Drug Awareness | నిఘా కొనసాగిస్తాం..
మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా చేసే వారిని, వాటిని విక్రయిస్తున్న వారిని, వాటిని వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ గట్టి నిఘా కొనసాగిస్తున్నామని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య (Police Commissioner Sai Chaitanya) తెలిపారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908కు కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని సీపీ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేంద్ర కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఈవో అశోక్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల,డీటీవో ఉమా మహేశ్వరరావు, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత, డీఎంహెచ్వో రాజశ్రీ, డీడబ్ల్యూవో పద్మ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Police Retirement Advice | కుటుంబంతో ప్రశాంతంగా గడపాలి: అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి
