అక్షరటుడే, హైదరాబాద్: Arunachalam Train Services | హైదరాబాద్ నుంచి తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం (తిరువణ్ణామలై)కు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. భక్తుల రద్దీ, పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కొన్ని వారాంతపు రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చడంతో పాటు మరికొన్ని రైళ్లను రోజువారీగా నడపనున్నట్లు వెల్లడించింది.
Arunachalam Train Services | భక్తుల సౌకర్యార్థం
ఇప్పటివరకు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తున్న నాంపల్లి–కన్యాకుమారి వీక్లీ ఎక్స్ప్రెస్ (07229 / 07230)ను ఇకపై రెగ్యులర్ (17069 / 17070)గా నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్పుతో అరుణాచలం సహా దక్షిణ భారతంలోని పలు ఆధ్యాత్మిక క్షేత్రాలకు ప్రయాణించే భక్తులకు మరింత సౌకర్యం ఏర్పడనుంది. ముఖ్యంగా కార్తీక దీపోత్సవం, పౌర్ణమి గిరిప్రదక్షిణ వంటి వేడుకల సమయంలో భారీగా వచ్చే భక్తులకు ఇది సౌకర్యవంతంగా ఉండనుంది.
ఇక కాచిగూడ–మధురై వీక్లీ ఎక్స్ప్రెస్ (17615/17616)ను ఇకపై ప్రతిరోజు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికితోడు ఈ రైలును తూత్తుకుడి వరకు కూడా పొడిగించారు. తద్వారా తమిళనాడు, దక్షిణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా మారనుంది.
తాజా నిర్ణయంతో తెలంగాణ నుంచి తమిళనాడుకు వెళ్లే పర్యాటకులు, భక్తులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ప్రయాణ సౌకర్యం మరింత మెరుగుపడనుంది. రైళ్ల సంఖ్య పెరగడం వల్ల టికెట్ల కోసం పోటీపడే సమస్య తగ్గి, నిరీక్షణ జాబితా సమస్య కూడా కొంతవరకు పరిష్కారం అవకాశం ఉందని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే శాఖ త్వరలోనే పూర్తి షెడ్యూల్, స్టాపేజీలు, టైమింగ్స్ వివరాలను ప్రకటించనుంది. ప్రయాణికులు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా సమీప రైల్వే స్టేషన్ ద్వారా తాజా సమాచారాన్ని పొందాలని రైల్వే అధికారులు సూచించారు.

