అక్షరటుడే, వెబ్డెస్క్: Bengal Elections | బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్పై విరుచుకు పడ్డారు.
టీఎంసీ ప్రజల మనసుల్లో భయాన్ని నాటిందని ప్రధాని అన్నారు. చొరబాటుదారులు బెంగాల్ యువత ఉద్యోగాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలు ఉండవని మాట ఇచ్చారు. ఎన్నికల్లో బీజేపీ (BJP) విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Bengal Elections |రాష్ట్రవ్యాప్తంగా..
గత ఎన్నికల్లో నందిగ్రామ్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee)పై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి సాధించిన విజయాన్ని మోదీ ప్రస్తావించారు. గత ఎన్నికల్లో జరిగిన ఆ అద్భుతం ఈసారి భబానీపూర్లోనూ, రాష్ట్రవ్యాప్తంగానూ పునరావృతమవుతుందని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం మేదినీపూర్, నందిగ్రామ్ (Nandigram) మార్పునకు మార్గాన్ని చూపించాయన్నారు.
Bengal Elections | అభివృద్ధికి అడ్డంకులు
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుండగా.. బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం (TMC Government) మాత్రం అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోందని మోదీ ఆరోపించారు. అభివృద్ధి చెందిన బెంగాల్ నిర్మాణానికి నిర్మమ్ సర్కార్ నిష్క్రమణ చాలా అవసరమన్నారు. మమత పాలనలో హల్దియాలోని ఫ్యాక్టరీలన్నీ మూతపడ్డాయని, అల్లరి మూకలు, నేరగాళ్ల దుకాణాలు మాత్రమే నడుస్తున్నాయని విమర్శించారు. ఒకప్పుడు దేశ ప్రగతికి పునాది వేసి, తయారీ, వాణిజ్య రంగాలను బలోపేతం చేసిన బెంగాల్ను టీఎంసీ అన్ని రంగాల్లో దిగజార్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇక్కడ విజయం సాధించాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. గత ఎన్నికల్లో సైతం తీవ్రంగా పోరాడినప్పటికి తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయాన్ని సాధించింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాలను గెలుచుకుంది.
ఇది కూడా చదవండి..: Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
