అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyber Crime Control | సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర కీలకమని హైదరాబాద్ (Hyderabad) సీపీ సజ్జనార్ అన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
రాష్ట్రంలో రోజు రోజుకు సైబర్ నేరాలు (Cyber Crimes) పెరుగుతున్నాయి. పోలీసులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. పలువురు మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ విషయంలో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా.. అత్యాశకు పోయి కొందరు సైబర్ నేరగాళ్ల వలకు చిక్కుతున్నారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ (CP Sajjanar) కీలక సూచనలు చేశారు.
Cyber Crime Control | అప్రమత్తం చేయాలి
ప్రజల సొమ్ముకు కాపలాదారులుగా ఉన్న బ్యాంకర్లు తమ కస్టమర్ల పట్ల మరింత బాధ్యతగా ఉండాలని సీపీ అన్నారు. వారు ఏదైనా మోసానికి గురవుతున్నట్లు గమనిస్తే వెంటనే అప్రమత్తం చేయాలని సూచించారు.ముఖ్యంగా డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల బారిన పడినప్పుడు కస్టమర్లు తమ డిపాజిట్లను హుటాహుటిన విత్డ్రా చేయడం, బంగారంపై పెద్ద ఎత్తున అప్పులు తీసుకోవడం వంటివి చేస్తుంటారని చెప్పారు. అటువంటి సమయాల్లో వారి ప్రవర్తనలో ఏవైనా అసాధారణ మార్పులు, ఆందోళన కనిపిస్తే అది సైబర్ ముఠాల పనేమోనని ఆరా తీయాలన్నారు.
Cyber Crime Control | పోలీసులకు ఫిర్యాదు చేయాలి
వృద్ధులు, పెన్షనర్లు తమ జీవితకాలపు సంపాదనను మోసగాళ్ల మాయలో పడి పోగొట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు గమనిస్తే వెంటనే పోలీసులకు, 1930 నంబర్కు, డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు. ప్రజలు కూడా పోలీసుల హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
కాగా ఇటీవల పలువురు బ్యాంక్ సిబ్బంది సైతం సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ పోలీసులకు చిక్కారు. కస్లమర్లకు రక్షణగా ఉండాల్సిన ఉద్యోగులు సైబర్ దొంగలతో కలిసి ప్రజల ఖాతాలను లూఠీ చేశారు. మ్యూల్ ఖాతాలు తెరవడం, డబ్బు బదలాయింపులో సహకరించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: GHMC Property Seizure | హైదరాబాద్లో మాజీ సీఎం ఇల్లు సీజ్
