అక్షరటుడే, వెబ్డెస్క్ : Ethanol Blending India | భారత్ ప్రధానంగా ముడిచమురు దిగుమతులపై ఆధారపడిన దేశం. గతంలో ముడి చమురు ఎక్కువగా పశ్చిమాసియా దేశాల నుంచి దిగుమతి అయ్యేది.
అయితే అనివార్య కారణాలతో చమురు సరఫరా నిలిచిపోతే దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉండడాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం (Central Government).. ఒక్క పశ్చిమాసియాపైనే ఆధారపడకుండా ఇతర దేశాలనుంచీ చమురు కొనుగోళ్లకు ఒప్పందాలు చేసుకుంది. ప్రస్తుతం 40కిపైగా దేశాలనుంచి చమురు దిగుమతి అవుతోంది.
Ethanol Blending India | విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు..
మన దేశంలో అవసరమైన క్రూడ్ ఆయిల్ (Crude Oil) నిల్వలు లేకపోవడంతో 85 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడ్డాం. దీంతో భారీగా విదేశీ మారకం ఖర్చవుతోంది. దీనిని తగ్గించేందుకు 2003లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి, పెట్రోల్లో ఇథనాల్ కలపడం ప్రారంభించింది. దీని ద్వారా ముడి చమురు దిగుమతులు కొంత తగ్గడమే కాకుండా విదేశీ మారక ద్రవ్యం కూడా ఆదా అవుతోంది.
Ethanol Blending India | 2014 తర్వాత వేగం..
2003లోనే పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ (Ethanol Blending) ప్రారంభమైనా నామమాత్రంగానే కలిపేవారు. ఖరీదైన ముడి చమురు దిగుమతులను తగ్గించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం వంటి లక్ష్యాలతో భారత ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మోదీ ప్రభుత్వ హయాంలో వేగం పుంజుకుంది. 2014 ఆర్థిక సంవత్సంలో సుమారు 1.5 శాతం ఇథనాల్ కలిపేవారు. ఇది క్రమంగా పెరుగుతూ గతేడాది డిసెంబర్ నాటికి 20 శాతానికి చేరింది. ఇలా చేయడం ద్వారా దేశం గణనీయమైన ఆర్థిక, పర్యావరణ మరియు వ్యవసాయ లాభాలు పొందింది.
ఇథనాల్ బ్లెండింగ్ పురోగతి (సంవత్సరాల వారీగా సగటు శాతం)..
2014-15: 1.14 శాతం
2020-21: 8.10 శాతం
2023-24: 14.60 శాతం
2024-25: 19.24 శాతం
2025-26 (జనవరి 2026 వరకు): 20 శాతం.
Ethanol Blending India | 30 శాతం లక్ష్యంగా అడుగులు..
2030 సంవత్సరం వరకు 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యం కాగా.. 2025 చివరిలోనే దీనిని చేరుకోవడం గమనార్హం. దీంతో ఇదే ఉత్సాహంతో 2030 నాటికి పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Ethanol Blending India | ఒక్క ఏడాదిలోనే రూ. 40 వేల కోట్లు..
ఇథనాల్ బ్లెండింగ్తో భారత్ ఎనర్జీ సెక్యూరిటీ పెంచుకుంది. ఆయిల్ ఇంపోర్ట్ బిల్లు తగ్గడంతోపాటు రైతుల ఆదాయం పెరిగింది. పర్యావరణానికీ మేలు జరుగుతోంది. 2014-15 నుంచి 2026 జనవరి వరకు సుమారు రూ. 1.65 లక్షల కోట్లు భారత ప్రభుత్వానికి ఆదా అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ. 40 వేల కోట్లు ఆదా కావడం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఇది రూ. 2 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా. “ఇథనాల్ మిశ్రమ విధానం లేకపోతే.. మనం విదేశాల నుంచి అదనంగా 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. రైతులే మన దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడారు” అని ఇటీవల నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. “భారత్కు అవసరమైన చమురులో దాదాపు 40 శాతం పశ్చిమాసియా నుండే అందుతోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ధరలు పెరిగినప్పటికీ, ఇథనాల్ వాడకం వల్ల భారత్ ఆ ప్రభావాన్ని తట్టుకోగలుగుతోంది” అని ప్రధాని వివరించారు.
ప్రయోజనాలు..
దేశంలో ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం తగ్గింది. ఇథనాల్ బ్లెండింగ్తో 260 నుంచి 283 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్ సబ్స్టిట్యూట్ అయినట్లు తెలుస్తోంది.
ఈ విధానం వల్ల మక్క, చెరుకు వంటి పంటలు సాగు చేసే రైతులకు మేలు జరుగుతోంది. 2014-15 నుంచి 2026 జనవరి వరకు రూ. 1,47,387 కోట్లు రైతులకు చెల్లించినట్లు తెలుస్తోంది.
పెట్రోల్లో బ్లెండింగ్ వల్ల ఎథనాల్ ఉత్పత్తి భారీగా పెరిగింది. గతంలో 38 కోట్లì లీటర్ల ఉత్పత్తి ఉండగా.. ప్రస్తుతం వేయి కోట్ల లీటర్లకు పైగా ఉత్పత్తి అవుతోంది.
దీని ద్వారా పర్యావరణానికీ మేలు చేకూరుతోంది. ఇ20తో వాహనాల్లో కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ ఎమిషన్స్ తగ్గతాయి. నికర సీవో2 ఎమిషన్స్ సుమారు 851 లక్ష మెట్రిక్ టన్నులు తగ్గినట్లు అంచనా.
ఇది కూడా చదవండి..: Commercial LPG Price Hike | చమురు ధరల దెబ్బ: కమర్షియల్ LPG సిలిండర్పై భారీ పెంపు.. రూ. 2,000 దాటిన ధరలు
