అక్షరటుడే, కామారెడ్డి: Extramarital Affair Murder | వివాహేతర సంబంధాలు నిండు జీవితాలను బలి చేస్తున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని భర్తల పాలిట కట్టుకున్న భార్యలు.. భార్యల పాలిట భర్తలు యమకింకరులుగా మారుతున్నారు. ప్రియుడి సహకారంతో దారుణ హత్యలకు పాల్పడుతున్నారు.
కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం ఉగ్రవాయి, రాఘవాపూర్ శివారులో ఈ నెల 3 న గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైన ఘటన వెలుగు చూసింది. ఉగ్రవాయి గ్రామ జీపీవో ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేలింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 07) రాత్రి సబ్ డివిజన్ కార్యాలయంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు.
Extramarital Affair Murder | ఇద్దరితోనూ..
ఏఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. భిక్కనూరు మండలం కాచాపుర్ గ్రామానికి చెందిన పాలమాకుల శ్రీనివాస్ గౌడ్ అనే ఆటో డ్రైవర్కు అదే గ్రామానికి చెందిన తొగరి భాగ్యలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఇదే మహిళతో మృతుడు శివశంకర్కి కూడా అక్రమ బంధం ఏర్పడింది.
అయితే, భాగ్యలక్ష్మికి శివశంకర్తో ఎక్కడ చెడిందో కానీ, శ్రీనివాస్ గౌడ్తో కలిసి అతడిని చంపేందుకు ప్రణాళిక రచించింది. ఈ క్రమంలో ముందస్తు ప్రణాళిక ప్రకారం.. శ్రీనివాస్ గౌడ్, తోగరి భాగ్యలక్ష్మి కలిసి ఈ నెల 2 న శివశంకర్కు మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లారు.
Extramarital Affair Murder | మద్యం తాగుదామని నమ్మించి..
ఉగ్రవాయి గ్రామ శివారులోని రాఘవేంద్ర రైస్ మిల్ సమీప ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం తాగుదామని నమ్మించి.. అదును చూసి శివశంకర్పై దాడి చేశారు. కత్తితో కడుపులో పలు మార్లు పొడిచి దారుణంగా హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పరారయ్యారు.
సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారం ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. సరంపల్లి క్రాస్ రోడ్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, ఆటో, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు.
