అక్షరటుడే, వెబ్డెస్క్ : Feeding Centers | మహిళలకు అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో రాణిస్తారని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) అన్నారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజం అని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్లోని ఆదివాసీ భవన్లో ఆదివారం వేడుకలు నిర్వహించారు. మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఆదివాసీ భవన్ (Adivasi Bhavan)లో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్, హెచ్పీవీ వ్యాక్సినేషన్ (HPV Vaccination), ఫీడింగ్ కియోస్క్ స్టాళ్లను మంత్రులు ప్రారంభించారు. ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండే మహిళల భద్రత, వసతి కోసం ప్రత్యేకంగా రూపొందించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ను ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల సభ్యులను వారు సన్మానించారు. కాగా బాలింతలు బయటకు వచ్చిన సమయంలో చిన్నారులకు పాలు పట్టడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్, మేడ్చెల్, రంగారెడ్డి జిల్లాల్లో 10 ప్రాంతాల్లోని బస్టాండ్లలో ఫీడింగ్ కియోస్క్ సెంటర్లను ప్రారంభించారు. బాలింతలు వీటిలో తమ పిల్లలకు పాలు ఇవ్వొచ్చు.
Feeding Centers | దేశాభివృద్ధికి పునాది
మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. మహిళా సాధికారత నినాదం కాదని, అది దేశ అభివృద్ధికి పునాది అన్నారు. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. తమ ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Feeding Centers | ఆరోగ్య పరీక్షలు
డ్వాక్రా మహిళల కోసం ఉచిత హెల్త్ స్క్రీనింగ్ (Health Screening) కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. రాష్ట్రంలోని 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 46 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేస్తామని మంత్రి వెల్లడించారు. సెర్ప్ సిబ్బంది సహకారంతో మహిళలకు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి 30 రకాల కీలక పరీక్షలు ఉచితంగా చేయిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల అనంతరం మహిళల డిజిటల్ హెల్త్ రికార్డు తయారు చేస్తామన్నారు.
Feeding Centers | హెచ్పీవీ వ్యాక్సినేషన్

రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 3,200 సర్వికల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని రాజనర్సింహ పేర్కొన్నారు. దీని నివారణకు హెచ్పీవీ (HPV) టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. 14 ఏళ్లు నిండిన సుమారు 4లక్షల మంది బాలికలకు ఈ టీకా వేస్తామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ను కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

