అక్షరటుడే, వెబ్డెస్క్ : Gautam Kumar Corruption Case | బీహార్ (Bihar)లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో జరిగిన ఈఓయూ (ఎకనామిక్ ఆఫెన్సెస్ యూనిట్) దాడులు సంచలనంగా మారాయి. కిషన్గంజ్ ఎస్డీపీఓగా పనిచేస్తున్న గౌతమ్ కుమార్ నివాసాలపై నిర్వహించిన సోదాల్లో భారీ స్థాయిలో అక్రమ ఆస్తులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.
సుమారు 32 ఏళ్ల సేవలో తన చట్టబద్ధ ఆదాయానికి మించి దాదాపు 60 శాతం అంటే సుమారు 80 కోట్ల రూపాయల బినామీ ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో మరింత సంచలనం రేపిన అంశం ఆయన ఇంట్లో పనిచేసే పనిమనిషి పారో గురించి బయటపడిన వివరాలే. సాధారణంగా పనిమనిషిగా పనిచేసే ఆమె జీవనశైలి మాత్రం విలాసవంతంగా ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది.
Gautam Kumar Corruption Case | పనిమనిషి పేరుతో కోటి రూపాయల బంగళా
దర్యాప్తులో భాగంగా, పారో అనే మహిళకు ఉత్తర దినాజ్పూర్ జిల్లా (Dinajpur District)లో సుమారు ఒక కోటి రూపాయల విలువైన బంగళా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా, ఆమె రోజువారీ జీవన విధానం కూడా అత్యంత విలాసవంతంగా ఉండేదని అధికారులు గుర్తించారు. పారో ప్రతిరోజూ ఖరీదైన ‘థార్’ కారులో పనికి వచ్చేదని, కొన్నిసార్లు గౌతమ్ కుమార్ ప్రభుత్వ వాహనాన్ని కూడా వినియోగించిందని సమాచారం. అదేవిధంగా ఆమెకు ‘బుల్లెట్’ బైక్ను గిఫ్ట్గా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాలు బయటకు రావడంతో కేసు మరింత హాట్ టాపిక్గా మారింది. పారో సోషల్ మీడియా (Social Media)లో కూడా చురుకుగా ఉండేది. ఇన్స్టాగ్రామ్ (Instagram)లో బుల్లెట్ బైక్పై రీల్స్ చేయడం, భారీ మొత్తంలో నగదును ప్రదర్శిస్తూ వీడియోలు పోస్ట్ చేయడం వంటి విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎస్డీపీఓ గౌతమ్ కుమార్ మరియు ఆయన సన్నిహితులతో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Gautam Kumar Corruption Case | నోయిడా మరియు గుర్గావ్ లో ఫ్లాట్లు
అయితే ఈఓయూ దాడుల విషయం తెలిసిన వెంటనే పారో తన సోషల్ మీడియా ఖాతాలను లాక్ చేసి, కుటుంబంతో కలిసి పరారైనట్లు సమాచారం. మార్చి 31న జరిగిన ఈ సోదాల్లో అధికారులు 36 భూములకు సంబంధించిన పత్రాలు, బంగారు-వెండి ఆభరణాలు, ఖరీదైన గడియారాలు, లగ్జరీ కార్ల (Luxury Cars)కు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పూర్ణియా లో నాలుగు అంతస్తుల భవనం, సిలిగురి లో తేయాకు తోటలు, నోయిడా మరియు గుర్గావ్ లో ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో గౌతమ్ కుమార్ను పదవి నుండి తప్పించి, హెడ్క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: Kodagu trekking missing techie | ట్రెక్కింగ్ కి వెళ్లి అదృశ్యమైన టెకీ ఆచూకీ లభ్యం
