అక్షరటుడే, వెబ్డెస్క్ : Handloom Workers Issue | కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేనేత కార్మికుల జీవితాలను మరింత సంక్షోభంలోకి నెట్టేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెస్కో(తెలంగాణ చేనేత సహకార సంఘం)కి విద్యాశాఖ అధికారులు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ల తయారీకి గతంలో టెస్కోకు అధికారులు ఆర్డర్ ఇచ్చారు. రూ.105.54 కోట్ల ఆర్డర్ను తాజాగా రద్దు చేశారు. దీంతో నేత కార్మికుల ఉపాధిపై ప్రభావం పడనుంది. ప్రభుత్వ నిర్ణయంపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు.
Handloom Workers Issue | ఏకపక్షంగా రద్దు
విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించి ఇచ్చే ఆర్డర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ ఏకపక్షంగా రద్దు చేసిందని కవిత విమర్శించారు. రూ.105 కోట్ల విలువైన టెండర్ రద్దు కావడంతో 393 చేనేత సహకార సంఘాల్లోని వేలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ శాఖలు, ఇతర డిపార్ట్మెంట్లు సైతం రూ.200 కోట్ల విలువైన దుప్పట్లు, ఇతర దుస్తుల పంపిణీకి గడువు ముగిసినా టెస్కోకు ఆర్డర్ ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.
Handloom Workers Issue | ప్రైవేట్ సంస్థ కోసం..
విద్యాశాఖ ఉన్న ఆర్డర్ రద్దు చేసి.. టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతోందని కవిత అన్నారు. ఏదో ఒక సంస్థకు మేలు చేయడానికి వేలాది చేనేత కార్మిక కుటుంబాల పొట్టకొట్టే కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) కుట్రలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని ఆమె హెచ్చరించారు. విద్యార్థుల యూనిఫాంలు సహా ప్రభుత్వ శాఖల టెండర్లు టెస్కోకు ఇచ్చే వరకు చేనేత కార్మికులతో కలిసి ఉద్యమిస్తామన్నారు.
ఇది కూడా చదవండి..: Kazipet Railway Division | కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి : కేటీఆర్
