అక్షరటుడే, వెబ్డెస్క్: Heart Attack | జగిత్యాల రూరల్ మండలం (Jagtial Mandal) పొరండ్ల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడో తరగతి చదువుతున్న చిన్నారి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
గ్రామానికి చెందిన తోపారపు చంద్రశేఖర్–నవిత దంపతుల కుమారుడు నిశాంత్ (9) స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం గ్రామ శివారులోని శివాలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపిన నిశాంత్, తర్వాత తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు.
Heart Attack | కుప్పకూలిపోయాడు..
అయితే కొద్ది సేపటికే అకస్మాత్తుగా కుప్పకూలి పడిపోవడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతన్ని జగిత్యాల ప్రభుత్వ దవాఖానాకు (Jagtial Government Hospital) తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్థులను కలిచివేశాయి. చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించడం స్థానికంగా ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల్లో పెరుగుతున్న ఆరోనారోగ్య సమస్యలపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులకు కూడా గుండెపోటు రావడం చాలా ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి..: Extramarital Affair Murder | ఇద్దరితో అక్రమ బంధం.. ఒకడి సహకారంతో మరొకడిని కడతేర్చిన మహిళ!
