అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad Water Crisis | ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగంటాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దీంతో నీటి కోసం నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల నిర్వాహకులు ప్రజలను దోచుకుంటున్నారు.
నగరంలో జలమండలి అధికారులు వాటర్ ట్యాంకర్లు సరఫరా చేస్తున్నారు. అయితే పలు ప్రాంతాల్లో ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో ట్యాంకర్ల దందా జోరుగా సాగుతుంది. శివారు ప్రాంతాల నుంచి నగరంలోని పలు ప్రాంతాలకు నీరు సరఫరా చేస్తున్నారు. దీని కోసం ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా చెరువుల్లో నుంచి కలుషిత నీటిని సైతం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కొందరు ట్యాంకర్ల యజమానులు జల మండలి పేరుతో సరఫరా చేస్తున్నారు. వారికి అధికారులు వార్నింగ్ ఇచ్చారు.
Hyderabad Water Crisis | కఠిన చర్యలు
జలమండలి అధికారిక లోగోను కొందరు వ్యక్తులు, ముఖ్యంగా ప్రైవేట్ నీటి ట్యాంకర్ యజమానులు అనధికారికంగా వినియోగిస్తున్నట్లు జలమండలి దృష్టికి వచ్చింది. అనుమతి లేకుండా లోగో వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రైవేట్ ట్యాంకర్లు జలమండలి లోగోను ఉపయోగించడం వల్ల, ఆ ట్యాంకర్లు ప్రభుత్వ సేవల భాగంగా ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇది ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా, మోసపూరిత చర్యగా పేర్కొన్నారు.
Hyderabad Water Crisis | బోరుబావుల నుంచి
ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా సరఫరా అయ్యే నీరు సాధారణంగా బోర్వెల్ల నుంచి సేకరిస్తారు. ఈ నీరు జలమండలి ప్రమాణాల ప్రకారం శుద్ధి చేసింది కాదు. అలాగే నాణ్యత పరీక్షలు కూడా చేయరు. దీంతో ఆ నీటిని వినియోగిస్తే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లపై ఆధారపడవద్దని కోరారు. తాగునీటి కోసం ట్యాంకర్లను బుక్ చేసుకునే సందర్భంలో జలమండలి అధికారిక కస్టమర్ కేర్ సేవల ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు. టోల్ ఫ్రీ నంబర్ 155313 కు కాల్ చేసి, సురక్షితమైన, శుద్ధి చేసిని తాగునీటిని పొందవచ్చని వివరించారు.
ఇది కూడా చదవండి : Footpath Encroachments | ఫుట్పాత్ ఆక్రమణలపై ఉక్కుపాదం

