హైదరాబాద్: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా భారత్ , ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ డిజిటల్ వ్యూయర్షిప్లో సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. మార్చి 5న జరిగిన ఈ కీలక మ్యాచ్ సందర్భంగా ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం జియోహాట్స్టార్ ఏకంగా 65.2 మిలియన్ల గరిష్ట కాన్కరెంట్ వీక్షకులను (Peak Concurrent Viewers) నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక లైవ్ ఈవెంట్ కోసం ఈ స్థాయిలో వీక్షకులు రావడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఈ మ్యాచ్ డిజిటల్ ప్లాట్ఫారమ్పై ఏకంగా 619 మిలియన్ల వ్యూస్ సాధించి అత్యధికంగా స్ట్రీమ్ చేయబడిన టీ20 మ్యాచ్గా నిలిచింది.
దుబాయ్ , ముంబై కేంద్రంగా వెలువడిన నివేదికల ప్రకారం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 క్రీడా , మీడియా రంగాల్లో కొత్త బెంచ్మార్క్లను సెట్ చేస్తోంది. సెమీఫైనల్ పోరుతో డిజిటల్ వీక్షణల పరంగా మునుపెన్నడూ లేని మైలురాయిని అధిగమించినట్లు స్పష్టమవుతోంది.
జియోహాట్స్టార్ సాధించిన ఈ 65.2 మిలియన్ల గరిష్ట వీక్షణల రికార్డు అంతకుముందు 2024 నవంబర్లో ఉన్న 65 మిలియన్ల అంతర్జాతీయ రికార్డును పక్కకు నెట్టింది. గతంలో పలు దేశాల మార్కెట్లను కలిపి ఆ రికార్డు నమోదు కాగా ఇప్పుడు కేవలం ఒకే ఒక్క భారతీయ మార్కెట్ నుంచే ఈ భారీ స్థాయి స్పందన రావడం విశేషం. ఇది జియోహాట్స్టార్ సాంకేతిక సామర్థ్యాన్ని , లైవ్ స్ట్రీమింగ్లో ఆ సంస్థకు ఉన్న పట్టును ప్రపంచానికి చాటిచెప్పింది. టీమ్ ఇండియా క్రేజ్ , సెమీఫైనల్ ఉత్కంఠ వెరసి ఈ అద్భుత రికార్డుకు బాటలు వేశాయి.
మైదానంలో రెండు జట్లు కలిపి 499 పరుగులు చేయడంతో అభిమానులకు అసలైన వినోదం లభించింది. టెలివిజన్ , డిజిటల్ మాధ్యమాల్లో కలిపి ఈ మ్యాచ్ 320 మిలియన్ల మందికి పైగా చేరుకుంది. అన్ని రకాల స్క్రీన్లపై కలిపి మొత్తం వాచ్-టైమ్ 23 బిలియన్ నిమిషాలు దాటడం క్రికెట్ చరిత్రలోనే ఒక సంచలనం.
ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జే షా స్పందిస్తూ కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులను ఈ ప్రపంచ కప్ ఏకం చేయడం గర్వంగా ఉందన్నారు. భారత్-ఇంగ్లాండ్ సెమీస్ గణాంకాలు క్రికెట్ పట్ల ఉన్న మక్కువను , క్రీడను ప్రజలకు చేరువ చేయడంలో సాధించిన పురోగతిని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. కేవలం మైదానంలోని ఆటగానే కాకుండా అభిమానుల ఉత్సాహానికి కూడా ఈ టోర్నీ చిరస్మరణీయంగా నిలుస్తుందని చెప్పారు.
జియోస్టార్ వైస్ ఛైర్మన్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ జియోస్టార్ సాంకేతిక నైపుణ్యానికి ఈ విజయం ఒక నిదర్శనమని అన్నారు. ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు ఈ సెమీఫైనల్ మ్యాచ్ చూశారని ఇంతటి భారీ లోడ్ ను తట్టుకుని ప్రసారాలు అందించడం భవిష్యత్ వినోద రంగానికి సంకేతమని ఆయన వెల్లడించారు. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో ఉన్న 533 మిలియన్ల వ్యూస్ రికార్డును ఈ మ్యాచ్ (619 మిలియన్ వ్యూస్) సునాయాసంగా దాటేసింది.
టోర్నీ ముగియక ముందే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 ప్రసార రంగంలో ఎన్నో రికార్డులను తిరగరాసింది. ఇక మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ , న్యూజిలాండ్ మధ్య జరగనున్న గ్రాండ్ ఫైనల్ కోసం క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ తుది పోరును అభిమానులు జియోహాట్స్టార్ , స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

