అక్షరటుడే, న్యూఢిల్లీ: India Minimum Wage | భారత్లో కార్మికుల ఆదాయ భద్రతను పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న కార్మికుల జీవన వ్యయం, ద్రవ్యోల్బణం దృష్ట్యా కార్మికులకు ఆర్థిక ఉపశమనం కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది.
India Minimum Wage | పెరుగుదల..
తాజా విధానం ప్రకారం.. నైపుణ్య స్థాయిల ఆధారంగా కనీస వేతనాల్లో పెరుగుదల ఉండనుంది. అన్స్కిల్డ్ కార్మికులైతే.. నెలకు ₹20,358 వరకు, హై స్కిల్డ్ వారికి ₹26,910 వరకు వేతనాలు ఉండేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. ఈ మార్పులు వివిధ రంగాల్లో ఉన్న కార్మికుల ఆదాయాన్ని స్థిరీకరించడంతోపాటు వారి కొనుగోలు శక్తిని మెరుగుపర్చుతాయని భావిస్తున్నారు.
India Minimum Wage | ప్రపంచ వ్యాప్తంగా అలా..
ప్రపంచంలోని పలు దేశాలు ఖర్చులను తగ్గించుకోవడం, ఉద్యోగాల్లో కోతపై దృష్టి పెడుతుంటే.. భారత్ మాత్రం తద్భిన్నంగా వేతనాల పెంపుదల ద్వారా దేశీయ వినియోగాన్ని పెంచే దిశగా అడుగులు వేయడం శుభ పరిణామమని పలువురు పేర్కొంటున్నారు. కార్మికుల చేతుల్లో అధిక డబ్బు ఉండటం వల్ల వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించే అవకాశముందంటున్నారు.
కాగా, తాజా నిర్ణయం వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలపై వ్యయభారం పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందంటున్నారు.
