అక్షరటుడే, వెబ్డెస్క్: India Oil Reserves | అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న ఘర్షణ మధ్యప్రాచ్యాన్ని ఉద్రిక్తతల్లోకి నెట్టింది. యూఎస్, ఇజ్రాయిల్ కలిసి చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ (Khamenei) మరణం తర్వాత ఆందోళనలు తాsస్థాయికి చేరాయి.
ఇరాన్ గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తుండడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన “హార్ముజ్ జలసంధి”ని ఇరాన్ మూసివేయడంతో చమురుతోపాటు సరుకుల రవాణా స్థంభించాయి. దీంతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు యుద్ధం మరో నాలుగైదు వారాలపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) పేర్కొన్నారు.
India Oil Reserves | సగానికిపైగా హార్ముజ్ జలసంధి ద్వారానే..
మన దేశం ముడి చమురు కోసం 85 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. హార్ముజ్ జలసంధి ద్వారానే యాభై శాతానికిపైగా చమురు దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో ముడిచమురు సరఫరా నిలిచిపోతే పరిస్థితి ఏమిటన్న సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మన దేశం సిద్ధంగా ఉంది. ఇప్పటికే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను భారీగా పెంచింది.

India Oil Reserves | రెండున్నర నెలలకు సరిపడా..
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 74 రోజుల వినియోగానికి సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చాలా అభివృద్ధి చెందిన దేశాలు 90 రోజుల నిల్వను లక్ష్యంగా పెట్టుకుంటాయని, భారత్ కూడా త్వరలోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన దేశం వ్యూహాత్మక నిల్వలను తొలి దశలో 3 ప్రధాన ప్రాంతాలలో ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భూగర్భ గుహల్లో ముడి చమురును భద్రపరుస్తున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రం మంగళూరు పశ్చిమ తీరంలో, అదే రాష్ట్రంలోని పాడూరులో నిల్వ కేంద్రాలున్నాయి. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి మూతపడినా రష్యన్ ఆయిల్ భారత్కు అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనితోడు వెనిజులా ఆయిల్ కూడా భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం కొనసాగినా ఇప్పటికప్పుడు భారత్కు వచ్చే ఇబ్బందులు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Iran Dubai Doha Attacks | దుబాయ్, దోహాలపై ఇరాన్ దాడులు.. ఆందోళనకరంగా పరిస్థితి

