అక్షరటుడే, వెబ్డెస్క్ : Indians Killed in Iran Attacks | పశ్చిమాసియా ఇంకా రగులుతూనే ఉంది. ఇరాన్ (Iran) ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఆయా దేశాల్లోని అమెరికా ఆస్తులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది.
గల్ఫ్ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. చాలా మంది బతుకు దెరువు కోసం వెళ్లి వలస కార్మికులుగా పనిచేస్తున్న వారే ఉన్నారు. ఇరాన్ దాడులతో వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు చనిపోయారు. ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల్లో ముగ్గురు భారత నావికులు చనిపోయినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఒమన్ (Oman) తీరంలోని రెండు నౌకలపై దాడి జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఒమన్లోని భారత రాయబార కార్యాలయం సైతం ధ్రువీకరించింది.
Indians Killed in Iran Attacks | భారత్లో ఆందోళన
గల్ఫ్ దేశాలపై దాడులతో భారత్లో ఆందోళన నెలకొంది. ఆయా దేశాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ (PM Modi) గల్ఫ్ దేశాల నేతలతో ఫోన్లో మాట్లాడారు.
Indians Killed in Iran Attacks | ఇరాన్కు మద్దతు తెలిపిన చైనా
ఇజ్రాయెల్, అమెరికా– ఇరాన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు దేశాలు మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికే గల్ఫ్ దేశాలకు పాకిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యుద్ధంలోకి చైనా (China) ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్కు డ్రాగన్ దేశం మద్దతు తెలిపింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని పేర్కొంది. వెంటనే ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపాలంది. కాగా తాజా పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పాలని సూచిస్తుంది. గల్ఫ్ దేశాలపై దాడులను మోదీ ఖండించారు.

