అక్షరటుడే, వెబ్డెస్క్ : Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 నుంచి రెండో దశ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు.
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ శాఖ 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా మొదటి దశలో ఇళ్లు మంజూరైన వారిలో లక్ష మంది గృహ ప్రవేశాలు చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Indiramma houses second phase | ఉచిత ఇసుక సరఫరా
ఏప్రిల్ 1 నుంచి రెండోదశ ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) మంజూరు కార్యక్రమం మొదలు కానుందని మంత్రి తెలిపారు. మొదటి దశలో రాష్ట్రమంతటా గ్రౌండింగ్ కాని (20 శాతం) లబ్ధిదారుల సమ్మతి తీసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనల మేరకు రెండో దశలో ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోందన్నారు. లబ్ధిదారులకు ఇసుక లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

Indiramma houses second phase | ధరల నియంత్రణకు కమిటీ
మహిళా సంఘాల ఆధ్వర్యంలో బ్రిక్ యూనిట్లు (Bric Units) ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నిర్మాణ సామగ్రి ధరల భారం లబ్ధిదారులపై పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పని చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు సకాలంలో చెల్లించకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.

