అక్షరటుడే, వెబ్డెస్క్ : Iran Missile Attack | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఓ వైపు అమెరికా యుద్ధానికి ఐదు రోజులు విరామం ప్రకటించినట్లు చెప్పినా.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికా (America) యుద్ధనౌకపై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
యూఎస్ఎస్ అబ్రహం లింకన్ (Abraham Lincoln) విమానవాహక నౌక వైపు తాము ఒక క్రూయిజ్ క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ అధికారిక టెలివిజన్ పేర్కొంది. దీనిపై అమెరికా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. అబ్రహం లింకన్ నౌక తమ నిఘాలో ఉందని, అది తమ భూభాగానికి సమీపిస్తే లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ ముందుగా హెచ్చరించింది. అనంతరం క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ సైన్యం బుధవారం తెలిపింది.
Iran Missile Attack | దూరంగా వెళ్లిన నౌక
ఇరాన్ నావికాదళ కమాండర్, రియర్ అడ్మిరల్ షహ్రామ్ ఇరానీ “శత్రువు” విమాన వాహక నౌక అబ్రహం లింకన్ కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అది ఇరాన్ క్షిపణి వ్యవస్థల పరిధిలోకి ప్రవేశించిన వెంటనే దాడి చేస్తామన్నారు. అనంతరం నౌక సమీపంలోకి రాగానే క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపారు. దీంతో అబ్రహం లింకన్ నౌక తన స్థానాన్ని మార్చుకోవలసి వచ్చిందన్నారు. అయితే ఇరాన్ ప్రకటనపై అమెరికా స్పందించలేదు.
Iran Missile Attack | 1,340 మంది మృతి
ఇరాన్పై ఫిబ్రవరి 28 నుంచి అమెరికా, ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ దాడులలో అప్పటి సుప్రీం నాయకుడు అలీ ఖమేనీతో సహా ఇప్పటివరకు 1,340 మందికి పైగా మరణించారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న ఇజ్రాయెల్, జోర్డాన్, గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్ డ్రోన్, క్షిపణులను ప్రయోగిస్తోంది. కాగా అమెరికా ఎఫ్–35 (F-35) విమానంపై దాడి చేసినట్లు ఇటీవల ఇరాన్ తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను సైతం విడుదల చేసింది. తాజాగా విమాన వాహన నౌకపై క్షిపణులు ప్రయోగించినట్లు తెలిపింది.
దీనిని కూడా చదవండి : Iran Currency Collapse | ఏడున్నర డాలర్లుంటే.. అక్కడ కోటీశ్వరులే!

