అక్షరటుడే, వెబ్డెస్క్: IRCTC Pilgrimage Tour | అయోధ్య (Ayodhya), కాశి (Kashi) వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునేవారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ‘అయోధ్య -కాశి పుణ్యక్షేత్ర యాత్ర వైద్యనాథ్ ధామ్’ పేరిట తీసుకువచ్చిన ఈ ప్యాకేజీ లో మూడు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ ఆలయాలను కవర్ చేశారు.
ఇందులో భాగంగా ఒడిశా(Odisha)లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన పూరీ, కోణార్క్ ఆలయాలు, ఝార్ఖండ్లోని ప్రముఖ వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం, ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇది మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు సాగే యాత్ర.
IRCTC Pilgrimage Tour | తెలుగు రాష్ట్రాలని స్టేషన్లలో..
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు (Bharat Gaurav Tourist Train) సికింద్రాబాద్ నుంచి ఏప్రిల్ 28న ప్రారంభమవుతుంది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలలోని సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా ప్రయాణిస్తుంది. ఆయా రైల్వే స్టేషన్లలో భక్తులు రైలు ఎక్కవచ్చు. యాత్ర అనంతరం ఆయా స్టేషన్లలో దిగవచ్చు.
IRCTC Pilgrimage Tour | ప్రయాణం ఇలా..
సికింద్రాబాద్ (Secunderabad) నుంచి ఏప్రిల్ 28న ఉదయం 11 గంటలకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బయలుదేరుతుంది.రెండో రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఒడిశాలోని మాలతీపట్పూర్ రైల్వేస్టేషన్కు చేరుకుంటుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పూరీకి తీసుకువెళ్తారు. హోటల్ గదిలో స్నానాదులు అయ్యాక పూరీ జగన్నాథ్ స్వామి దర్శనం ఉంటుంది. రాత్రికి అక్కడే బస కల్పిస్తారు.మూడో రోజు అల్పాహారం ముగించుకొన్న తర్వాత కోణార్క్ సూర్య దేవాలయానికి వెళ్తారు. అనంతరం మాలతీపట్పూర్ రైల్వేస్టేషన్కు చేరుకొని ఝార్ఖండ్కు పయనమవుతారు.
నాలుగో రోజు ఉదయం 6 గంటలకు ఝార్ఖండ్లోని జస్దిహ్ రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యాక, శివుడి పవిత్ర నివాసమైన బాబా వైద్యానాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శిస్తారు. ఆ తర్వాత జస్దిహ్ నుంచి ఉత్తర్ప్రదేశ్కు బయలుదేరుతారు.
ఐదో రోజు ఉదయం 9 గంటలకు ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి వసతి కోసం సార్నాథ్కు వెళ్తారు.
ఆరో రోజు అల్పాహారం ముగించుకొని ప్రసిద్ధ కాశీవిశ్వనాథ్, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణాదేవి ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం గంగా హారతి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత హోటల్లో బస అనంతరం అయోధ్యకు బయలుదేరుతారు.
ఏడో రోజు మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్య ధామ్కు చేరుకొని రామజన్మభూమిని, హన్మాన్ ఆలయాలను దర్శిస్తారు. రాత్రి భోజనం అనంతరం ప్రయాగ్ రాజ్కు బయల్దేరుతారు.ఎనిమిదో రోజు ఉదయం 5 గంటలకు ప్రయాగ్ సంగమం రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. గంగ, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో స్నానాలు, పూజలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాగ్ సంగమం స్టేషన్ నుంచి సికింద్రాబాద్కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.తొమ్మిదో రోజు ప్రయాణం సాగుతుంది. పదో రోజు ఉదయం 9 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది

IRCTC Pilgrimage Tour | ప్యాకేజీ చార్జీలు ఇలా..
స్లీపర్ క్లాస్ ఒక్కో టికెట్ ధర పెద్దలకు రూ. 16,700. 5 -11 ఏళ్ల మధ్య వయసువారికి రూ. 15,600. వీరికి బస చేసే హోటల్లో నాన్ ఏసీ గదులు ఇస్తారు. ఒక్కో గదిలో నలుగురైదుగురు బస చేయాల్సి ఉంటుంది. నాన్ ఏసీ వాహనాల్లో ప్రయాణం ఉంటుంది.
3ఏసీ టికెట్ ధర పెద్దలకు రూ. 26,100. 5 -11 ఏళ్ల మధ్యవారికి రూ.24,800. రాత్రిపూట బసకు ఏసీ గదులు కేటాయిస్తారు. ఒక్కో గదిలో ఇద్దరు లేదా ముగ్గురికి బస కల్పిస్తారు.2ఏసీ టికెట్ ధర పెద్దలకు రూ.34,100. 5 -11 ఏళ్లవారికి రూ.32,500. బస చేసేందుకు ఏసీ గదులు ఇస్తారు. ఇద్దరు లేదా ముగ్గురు గదిని షేర్ చేసుకోవాలి.
IRCTC Pilgrimage Tour | ప్యాకేజీలోనే..
ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బందే చూసుకుంటారు. ప్యాకేజీని బట్టి ప్రయాణానికి ఏసీ వాహనం సమకూరుస్తారు. యాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అవసరమైన సాయం కోసం ఐఆర్సీటీసీ టూర్ మేనేజర్లు అందుబాటులో ఉంటారు. రైలు ప్రయాణంలో భద్రత కల్పిస్తారు. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే యాత్రికులే చెల్లించాలి. కేటాయించిన గదులకు ఏవైనా అదనపు సదుపాయాలు కావాలంటే ఆ చార్జీలనూ యాత్రికులే భరించాలి.
ఇది కూడా చదవండి..: Railway Ticket Cancellation | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్లో మార్పులు..

