అక్షరటుడే, వెబ్డెస్క్: IRCTC Summer Tours | వేసవి సెలవుల్లో పర్యటనలు, తీర్థయాత్రలు చేయాలనుకునే వారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక సమ్మర్ టూర్ ప్యాకేజీలను తీసుకువచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యాత్రికుల కోసం హైదరాబాద్ నుంచి నాలుగు ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్స్’ను నడపనుంది. ఇవి ఏప్రిల్ 28 నుంచి జూన్ 12 వరకు ఉంటాయి. ప్యాకేజీల వివరాలు ఇలా ఉన్నాయి.
IRCTC Summer Tours | ప్యాకేజీ-1 :
పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, కాశి, ప్రయాగరాజ్ ప్రాంతాలు ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ యాత్ర ఏప్రిల్ 28 న ప్రారంభమై మే 7 న ముగుస్తుంది. టికెట్ ధరలు స్లీపర్ క్లాస్ రూ. 16,700, ఏసీ(3ఏ) రూ. 26,100, ఏసీ(2ఏ) రూ.34,100. రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగా వెళ్తుంది. ఆయా ప్రాంతాల టూరిస్ట్లు ఈ రైలులో ఎక్కవచ్చు.
IRCTC Summer Tours | ప్యాకేజీ-2:
మధుర, బృందావన్, హరిద్వార్, వైష్ణోదేవి, రిషికేశ్ ప్రాంతాలు కవర్ చేస్తారు. ఈ యాత్ర మే 12 నుంచి మే 21 వరకు ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,500, ఏసీ(3ఏ) రూ.25,700, ఏసీ(2ఏ) రూ.33,400. రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై భువనగిరి, జనగాం, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్ష, నాగ్పూర్ మీదుగా ప్రయాణిస్తుంది.
IRCTC Summer Tours | ప్యాకేజీ-3:
ఇందులో అరుణాచలం, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, తిరుచ్చి, తంజావూరు, చిదంబరం ప్రాంతాలు కవర్ అవుతాయి. యాత్ర మే 24 నుంచి మే 31 వరకు ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.14,500, ఏసీ(3ఏ) రూ.21,700, ఏసీ(2ఏ) రూ.27,900 గా నిర్ణయించారు. రైలు సికింద్రాబాద్ నుంచి జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.
ప్యాకేజీ-4:
యమునా నది పుష్కరాల సందర్భంగా పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్, కాశీ యాత్రకు వెళ్ళాలి అనుకుంటున్న వారికోసం ఈ ప్యాకేజీ తీసుకువచ్చారు. ఈ యాత్ర జూన్ 3 నుంచి జూన్ 12 వరకు ఉంటుంది. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.16,700, ఏసీ (3ఏ) రూ.26,100, ఏసీ (2ఏ) రూ.34,100గా ఉంది.
ఇవన్నీ ప్యాకేజీలో భాగంగానే..
ప్రయాణికులకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, టీ, కాఫీ, స్నాక్స్, వాటర్ బాటిల్స్ అందిస్తారు. ఒక్కో యాత్రలో 30 మంది టూరిస్టులను ఒక గ్రూపుగా చేసి, వారికి ఇద్దరు గైడ్లు, ఒక రైల్వే అధికారి అందుబాటులో ఉంటారు.
ఇది కూడా చదవండి..: Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..

