అక్షరటుడే, వెబ్డెస్క్: Kabul Airstrike | ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో Kabul ఘోర వైమానిక దాడి జరిగినట్టు సమాచారం వెలువడింది. కాబూల్లో ఉన్న మాదకద్రవ్యాల బానిసల చికిత్సా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ వైమానిక దాడి నిర్వహించిందని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దాడిలో సుమారు 400 మంది మరణించగా మరో 200 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
స్థానిక సమయం ప్రకారం సోమవారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో కాబూల్ నగరాన్ని భారీ పేలుళ్లు కుదిపేశాయని స్థానిక మీడియా తెలిపింది. పేలుళ్లతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Kabul Airstrike | తోసిపుచ్చిన పాకిస్థాన్
ఆఫ్ఘనిస్తాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరఫత్ జమాన్ మాట్లాడుతూ డ్రగ్స్కు బానిసైన వారికి చికిత్స అందించే ఆసుపత్రి పూర్తిగా ధ్వంసమైందని చెప్పారు. అక్కడ ఉన్న భవనాలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ దాడిపై తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిపై Hospital దాడి చేయడం మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరమని ఆయన మండిపడ్డారు. అంతర్జాతీయ నిబంధనలను పాకిస్థాన్ ఉల్లంఘించిందని ఆరోపించారు. రంజాన్ ఉపవాస దీక్షలు ముగిసిన తర్వాత ప్రజలు బయట ఉన్న సమయంలో ఈ దాడులు జరగడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఆయన అన్నారు.
Kabul Airstrike | క్రికెటర్ రషీద్ ఖాన్..
ఇదిలా ఉండగా తాలిబన్ ఆరోపణలను పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. తాము ఎటువంటి ఆసుపత్రులను లేదా పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. కేవలం ఉగ్రవాద మౌలిక సదుపాయాలు, సైనిక స్థావరాలపైనే దాడులు నిర్వహించామని పాక్ తెలిపింది.
ఆయుధ నిల్వ కేంద్రాలు మరియు సాంకేతిక పరికరాల కేంద్రాలపై మాత్రమే ఆపరేషన్ నిర్వహించామని వెల్లడించింది. తాలిబన్ ప్రతినిధులు చేస్తున్న ఆరోపణలు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు చేస్తున్న తప్పుడు ప్రచారమని పాకిస్థాన్ సమాచార శాఖ కొట్టిపారేసింది.
ఈ ఘటనపై ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ rashid Khan కూడా స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పౌర ప్రాంతాలు, విద్యా సంస్థలు లేదా ఆసుపత్రులపై దాడులు చేయడం యుద్ధ నేరమని ఆయన అన్నారు.
ముఖ్యంగా పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరమని, అసహ్యకరమని పేర్కొన్నారు. గత మూడు వారాలుగా పాకిస్థాన్–ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్లో దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని పాక్ ఆరోపిస్తోంది.

