అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy college land controversy : కామారెడ్డిలో విద్యార్థుల కోసం సేకరించిన 263 ఎకరాల భూమి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందులో 26 ఎకరాలు అరోరా కళాశాలకు కేటాయించడం దుమారం రేపుతోంది. ఈ స్థలం కేటాయింపు గతంలోనే జరిగినా ప్రస్తుతం ఆ స్థలమే వ్యక్తిగత ఆరోపణలకు బీజం వేసిందన్న టాక్ వినిపిస్తోంది. విద్యార్థి సంఘాలు కొట్లాడి ఆస్తులను కళాశాల పరం చేసినా మళ్లీ వివాదం రాజుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది.
కామారెడ్డి ప్రభుత్వ కళాశాలకు చెందిన 263 ఎకరాల భూమిలో (Kamareddy college land controversy) కొంత వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు, పరిశ్రమలకు కేటాయించారు. ఇందులో నుంచే అరోరా కళాశాలకు 26 ఎకరాలు కేటాయించడం వెనక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు, ఆ భూములు తనఖా పెట్టి యాజమాన్యం రుణాలు తీసుకోవడం చర్చకు దారి తీస్తున్నాయి. ఈ విషయమై ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మధ్య మాటల యుద్ధం కొనసాగగా ఆరోపణల అనంతరం షబ్బీర్ అలీ మౌనం దాల్చడం వెనక అంతర్యం ఏమిటన్న చర్చ సాగుతోంది.
Kamareddy college land controversy : అరోరా కాలేజీపై..
ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల వివాదం మొత్తం అరోరా కళాశాల (Kamareddy college land controversy)
చుట్టే తిరుగుతోంది. ఆ కళాశాలకు సంబందించిన యాజమాన్యాన్ని కమిటీలోకి ఆహ్వానించడం, కళాశాలకు 26 ఎకరాల కేటాయింపులు, భూములు తనఖా పెట్టి రుణం తీసుకునే అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ మూడింటిలో ఎమ్మెల్యే రమణారెడ్డి పాత్ర ఉందంటూ ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాంతో ఇందులో తన పాత్ర ఏమి లేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై పడింది.
కమిటీలో ఉన్నందుకే..
కళాశాలకు సంబంధించిన కమిటీలో వెంకటరమణారెడ్డి తండ్రి కేపీ రాజిరెడ్డి కొనసాగారు. కమిటీలో ఉన్న కొందరు మృతి చెందడంతో వాళ్ల వారసులు వచ్చారు. అయితే ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి కమిటీలో స్థానం ఎలా లభించిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆయన హయాంలోనే కళాశాల భూములు ఇతరులకు కేటాయింపులు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
ఎమ్మెల్యే ప్రాణాలకు హానీ ఉందని ఇటీవల బీజేపీ నాయకులు వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనకు ప్రాణభయం లేదని, ప్రాణభయం అంటే ఏమిటో వాళ్లకే చూపిస్తానని వ్యాఖ్యానించారు. పోతూ పోతూ పదిమందిని తీసుకువెళ్తానని మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో కాంగ్రెస్ నాయకులు వైరల్ చేస్తున్నారు.
స్పందించని షబ్బీర్ అలీ
మున్సిపల్ ఎన్నికల తర్వాత ఈ నెల 16న ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అవినీతి ఆరోపణలు చేశారు. దానికి ఎమ్మెల్యే రమణారెడ్డి సైతం ధీటుగా బదులిచ్చారు. దాంతో వివాదం ముదిరింది. ఆస్తుల వివాదంపై అగ్గి రాజుకుంటుండగా ఎమ్మెల్యే నేరుగా షబ్బీర్ ఆలీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే ఆరోపణలపై షబ్బీర్ అలీ సైలెంట్గా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారని, తెలంగాణ యూనివర్సిటీ తేలేకపోయారని, ఒక్క మోడల్ పాఠశాల కూడా మంజూరు చేసుకోలేకపోయారని విమర్శించారు. అయితే ఏ ఒక్క ఆరోపణలపై కూడా షబ్బీర్ అలీ స్పందించడం లేదు. షబ్బీర్ అలీ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటని పట్టణవాసులు చర్చించుకుంటున్నారు.
విద్యార్థి సంఘాల ఎంట్రీ
తాజాగా కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా కళాశాల ఆస్తులపై విద్యార్థి సంఘాలు ఎంట్రీ ఇచ్చాయి. నాడు కళాశాల కోసం సేకరించిన స్థలాన్ని ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలకు కేటాయించినప్పుడు నాయకులు ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నాయకులు అభివృద్ధిపై పోటీ పడాలని, విద్యాసంస్థలు తీసుకురావడంలో పోటీ పడాలని సూచించారు. కళాశాల ఆస్తులను పరిరక్షించేందుకు మరోసారి ఉద్యమం లేవనెత్తుతామని, జేఏసీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది.
ఇది కూడా చదవండి..: Tirumala Laddu Controversy | కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు

