అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Commissioner | కామారెడ్డి మున్సిపల్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. నూతనంగా ఏర్పాటైన కౌన్సిల్ ఆగ్రహానికి గురైన కమిషనర్ రాజేందర్ రెడ్డి బడ్జెట్ సమావేశం జరిగిన శనివారమే సెలవుపై వెళ్లారు.
వచ్చేనెల 12వరకు కమిషనర్ సెలవుపై వెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పటివరకు కామారెడ్డి (Kamareddy) ఆర్డీఓ ఎన్ వై గిరికి కమిషనర్ గా బాధ్యతలు అప్పగించారు. దాంతో ఆయన సోమవారం సాయంత్రం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవోను మున్సిపల్ ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి (Ippa Umarani) మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Kamareddy Municipal Commissioner | తిరిగొస్తారా..?
కమిషనర్ సెలవుపై వెళ్లడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నూతన పాలకవర్గం ఆయనను సరెండర్ చేయాలని బడ్జెట్ సమావేశం (Budget Session)లో తీర్మానం చేయడంపై ఆయన అసహనానికి గురైనట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన అదే రోజు సెలవు పెట్టి వెళ్లినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఏప్రిల్ 5న జనరల్ బాడీ సమావేశం జరగనున్న సందర్భంగా మరోసారి పాలకవర్గ సభ్యులు కమిషనర్పై సరెండర్ తీర్మానం చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కమిషనర్ సెలవుపై వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే టీపీవో గిరిధర్ సెలవులో ఉండగా కమిషనర్ సూచన మేరకే బడ్జెట్ సమావేశం రోజు వచ్చి మధ్యాహ్నమే వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఆరోజు టీపీవో సెలవులో ఉండి సమావేశానికి రాకపోయి ఉంటే ఆయనపై సరెండర్ తీర్మానం చేసేవారు కాదన్న టాక్ వినిపిస్తోంది. అయితే కమిషనర్ ఏప్రిల్ 12వరకు సెలవుపై వెళ్లడంతో తిరిగి వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరెండర్ చేసేవరకు చూడకుండా లాంగ్ లీవ్లో వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి..: Nizamabad Bike Accident | బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
