అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR ACB Chargesheet | ఫార్ములా ఈ కారు రేస్ కేసులో ఏసీబీ అధికారులు (ACB Officers) సోమవారం ఛార్జిషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఏ4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ5గా యూకేకి చెందిన ఎఫ్ఈవో సంస్థను ఏసీబీ చేర్చింది. దీనిపై తాజాగా ఎక్స్ వేదికగా కేటీఆర్ (KTR) స్పందించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ల నాలుగు నెలలు అయిందని కేటీఆర్ అన్నారు. అన్ని పత్రాలు, ప్రభుత్వ యంత్రాంగం కాంగ్రెస్ చేతిలో ఉందని చెప్పారు. అయినా కూడా కేవలం ఫార్ములా ఇ రేసు విషయంలో అదీ బ్యాంకు నుంచి బ్యాంకుకు నిధులు బదిలీ అయినందుకు కేసు పెట్టారని ఎద్దేవా చేశారు. ఈ ఏసీబీ ఛార్జిషీట్ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వపు స్పష్టమైన నిస్సహాయతకు ప్రతీక అన్నారు. అంతేగాకుండా తమ పారదర్శక పాలనకు ఒక ధృవీకరణ పత్రం అని పేర్కొన్నారు.
KTR ACB Chargesheet | అభివృద్ధిపై దృష్టి పెట్టాం
బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదని ఈ ఛార్జిషీట్ నిరూపిస్తోందని కేటీఆర్ అన్నారు. తాము కేవలం అభివృద్ధిపైనే దృష్టి సారించి ప్రభుత్వాన్ని నడిపామన్నారు. హైదరాబాద్ను వరల్డ్ ఫార్ములా ఇ రేసింగ్ (World Formula E Racing)లో చేర్చడానికి ఉపయోగించిన రూ. 49 కోట్ల బ్యాంకు నుంచి బ్యాంకుకు నిధుల బదిలీని ఒక స్కామ్గా చిత్రీకరించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR ACB Chargesheet | రూ.55 కోట్ల నష్టం
బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ (Hyderabad)లో ఫార్ములా ఈ కారు రేసు నిర్వహించారు. ఇందులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసు పెట్టింది. ఇప్పటికే ఏసీబీ అధికారులు కేటీఆర్తో పాటు పలువురిని విచారించారు. ఆయన విచారణకు ఇటీవల గవర్నర్ అనుమతించారు. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు కేంద్ర ప్రభుత్వం (Central Government) సైతం ఒకే చెప్పింది. దీంతో ఏసీబీ అధికారులు ఛార్జిషీటు దాఖలు చేశారు. రేస్ కోసం విదేశీ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా సొమ్ము చెల్లించడంతో ప్రభుత్వానికి రూ.55 కోట్ల మేర నష్టం జరిగిందని ఏసీబీ తెలిపింది.
ఇది కూడా చదవండి..: Petrol Shortage Rumors | రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు.. డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ

