అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR on Six Guarantees | బడ్జెట్ సమావేశాల్లో (Budget Sessions) ఆరు గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు.
బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ వర్క్షాప్నకు బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్లు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అసెంబ్లీ విప్ వివేకానంద తదితరులు హాజరు అయ్యారు. వర్క్షాప్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
KTR on Six Guarantees | అబద్ధాలు మాట్లాడుతూ..
రాష్ట్రంలో బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభ (Assembly)లోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్ని కాంగ్రెస్ ప్రభుత్వం వాడుతుందని కేటీఆర్ విమర్శించారు. శాసనసభ, శాసనమండలిలో సైతం అబద్ధాలను, అసత్యాలను మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ రెండన్నర సంవత్సరాల తర్వాత కూడా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KTR on Six Guarantees | ప్రైవేట్ బిల్లు పెడతాం
అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ తరఫున ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెడతామని కేటీఆర్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కోటి 67 లక్షల మంది మహిళలకు ఇస్తామన్న రూ.2500 కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా అసెంబ్లీలో కమిటీలను వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలెక్ట్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, పిటిషన్స్ కమిటీ లేవన్నారు. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) సైతం లేరని.. తూతూ మంత్రంగా ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోందన్నారు.
ఇది కూడా చదవండి : Temple Circuit | బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్

