అక్షరటుడే, భీమ్గల్: Lakshmi Narasimha Dolotsavam | పట్టణంలోని గ్రామాలయంలో లక్ష్మీనృసింహాస్వామి డోలోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని క్షేత్రంలో భక్తిభావం వెల్లివిరిసింది. ఫాల్గుణ పూర్ణిమ పర్వదినం సందర్భంగా ఉత్తర ఫల్గుణి నక్షత్రయుక్త శుభ ఘడియల్లో స్వామివారికి ఈ డోలోత్సవ కార్యక్రమాన్ని అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.

Lakshmi Narasimha Dolotsavam | భక్తి సంకీర్తనల మధ్య..
ఉత్సవంలో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం రంగురంగుల పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేశారు. ‘జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలి పరమానంద రామ గోవిందా’ అంటూ అర్చకులు, భక్తులు ఆలపించిన భజనలు, కీర్తనలతో గ్రామాలయమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారిని ఊయల ఊగిస్తూ భక్తులు దర్శించుకున్నారు.
ఊయల సేవ..
రాత్రివరకు కొనసాగిన ఈ వేడుకల్లో భీమ్గల్ (Bheemgal) పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. హోలీ సందర్భంగా స్వామివారికి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామాలయం భజన బృందాల సంకీర్తనలతో వైకుంఠాన్ని తలపించింది. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి, అర్చక బృందం పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

