అక్షరటుడే, వెబ్డెస్క్ : Legislative Council Building | ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ, భిన్న ఆలోచనలకు, విభిన్న చర్చలకు ఆస్కారం ఇచ్చే ప్రజాస్వామ్య వేదికలు చట్టసభలు అని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఆధునీకరించి, పునరుద్ధరించిన శాసన మండలి భవన సముదాయాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు.
శాసన మండలి భవనం పాతబడటంతో ప్రభుత్వం పునరుద్ధరించింది. ఆ పనులు పూర్తికావడంతో ఆదివారం మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి సీఎం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పునర్నిర్మాణం కోసం జరుగుతున్న ఈ చారిత్రక ఘట్టంలో భాగస్వామిని కావడం గర్వంగా ఉందన్నారు.
Legislative Council Building | ప్రజల సమస్యలకు పరిష్కారం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ఈ భవనం ప్రారంభంపై ఎక్స్ వేదికగా స్పందించారు. ముఖ్యంగా ఆర్అండ్బీ శాఖ మంత్రిగా ఈ భవన పునరుద్ధరణ బాధ్యతలను పర్యవేక్షించినట్లు చెప్పారు. శాసనసభ, శాసనమండలి రెండు సభలు పూర్తి సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రజా ప్రభుత్వం బలంగా నమ్ముతోందన్నారు. ఈ భవనం రాబోయే కాలంలో అర్ధవంతమైన మేధోమథనాలకు, చారిత్రాత్మక ప్రజాహిత నిర్ణయాలకు వేదిక కావాలని మంత్రి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు.


