అక్షరటుడే, వెబ్డెస్క్ : Licensed Surveyors | లైసెన్స్డ్ సర్వేయర్లకు గౌరవ వేతనం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల పేరిట ప్రజలను నమ్మించి నట్టేటా ముంచిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం లైసెన్స్డ్ సర్వేయర్ల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే. ఎంతో మంది దీని కోసం దరఖాస్తు చేసుకోగా.. పరీక్ష పెట్టి అర్హులను ఎంపిక చేసింది. అనంతరం వారికి నియామక పత్రాలు అందించి, శిక్షణ కూడా ఇచ్చింది. అయితే వారికి వేతనాలు కాకుండా భూముల సర్వే ఆధారంగా కమీషన్ ఇస్తామని తెలిపింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు తమ సమస్యను మాజీ మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లారు.
Licensed Surveyors | మాయ మాటలు చెప్పి..
ప్రభుత్వం చెప్పిన మాయమాటలు నమ్మి.. చేస్తున్న ప్రైవేట్, ఐటీ ఉద్యోగా (IT Jobs) లు వదిలేసుకుని వచ్చిన 6,500 మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నట్టేట ముంచిందని హరీశ్రావు విమర్శించారు. మంచి జీతం ఇస్తామని ఆశపెట్టి, శిక్షణ ఇచ్చి, ప్రమాణ స్వీకారాలు చేయించి.. తీరా ఇప్పుడు ఎకరం సర్వే చేస్తే 10 రూపాయల కమీషన్ ఇస్తామనడం విద్యావంతులైన యువతను అవమానించడమే అన్నారు. ఏడాది పొడవునా కష్టపడి రెండు వేల ఎకరాలు సర్వే చేసినా వీరికి వచ్చేది రూ.20 వేలే అన్నారు.
Licensed Surveyors | అండగా ఉంటాం
సిద్దిపేట (Siddipeta)లో తనను కలిసి గోడు వెళ్లబోసుకున్న సర్వేయర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హరీశ్రావు హామీ ఇచ్చారు. ప్రభుత్వం కమీషన్ల పేరుతో వాళ్ల జీవితాలతో ఆడుకోకుండా.. తక్షణమే గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సర్వేయర్ల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.
అవినీతి పెరిగే అవకాశం
ప్రస్తుతం రెవెన్యూశాఖలో భారీగా అవినీతి జరుగుతోంది. తహశీల్దార్ కార్యాలయాల్లో పలువురు అటెండర్ల నుంచి తహశీల్దార్ల వరకు లంచాల పేరిట ప్రజలను వేధిస్తున్నారు. సర్వేయర్లు అయితే డబ్బులు ఇస్తేనే సర్వేకు వస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లకు జీతాలు ఇవ్వకపోతే వారు రైతులను మామూళ్లు అడిగే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

దీనిని కూడా చదవండి : Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్

