అక్షరటుడే, వెబ్డెస్క్ : Loan Apps | లోన్ యాప్స్ ఉచ్చులో చిక్కుకొని మరో యువకుడు బలి అయ్యాడు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని కాకినాడలో చోటు చేసుకుంది.
ఒడిశాకు చెందిన మహ్మద్ బషీర్ (22) కాకినాడ జిల్లా (Kakinada District) గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతడు ఆన్లైన్ బెట్టింగ్కు బానిస అయ్యాడు. దీంతో భారీగా డబ్బులు నష్టపోయాడు. ఈ క్రమంలో పోయిన డబ్బులు తిరిగి రాబట్టుకోవాలని లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకున్నాడు. వాటితో ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting) పెట్టగా.. అవికూడా పోయాయి. దీంతో అప్పులు ఎక్కువ కావడంతో వాటిని ఎలా తీర్చలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Loan Apps | మంచి కొడుకుగా ఉండలేకపోయా
బషీర్ సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరిని కలిచి వేస్తోంది. అమ్మ నన్ను క్షమించు.. మంచి కొడుకుగా ఉండలేకపోయా.. నా కోసం ఎంతో కష్టపడ్డ నీకు మళ్లీ భారాన్ని మిగిల్చాను అంటూ తల్లికి లేఖ రాసి తనువు చాలించాడు. అప్పుల నుంచి బయటపడే మార్గం కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Loan Apps | విద్యార్థులే లక్ష్యంగా..
ఆన్లైన్ బెట్టింగ్ను ప్రభుత్వం నిషేధించింది. అయినా కూడా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. అలాగే లోన్ యాప్లపై ఆర్బీఐ (RBI) కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నా… అనేక యాప్లు పుట్టుకొస్తున్నాయి. యువత, విద్యార్థులే లక్ష్యంగా ఈ యాప్లో రుణాలు ఇస్తున్నాయి. సాధారణంగా రుణ సంస్థలు, బ్యాంకులు ఉద్యోగులు, ఆర్థిక భరోసా ఉన్న వారికి అప్పులు ఇస్తాయి. లోన్ యాప్లు మాత్రం విద్యార్థులు, యువతకు అడిగినంత లోన్లు ఇస్తున్నాయి. అయితే వాటితో పలువురు బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్స్, ఇతర జల్సాలు చేస్తున్నారు.
Loan Apps | డబ్బుల కోసం వేధింపులు
అప్పులు తీసుకున్న వారు వాటిని తిరిగి తీర్చలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. లోన్ యాప్ల్లో వడ్డీ సైతం అధికంగా ఉంటుంది. తిరిగి చెల్లించకపోతే యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నారు. సదరు వ్యక్తి తల్లిదండ్రులు, బంధువులకు ఫోన్ చేసి తీసుకున్న అప్పు గురించి చెబుతున్నారు. దీంతో పరువు పోతుందని పలువరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లోన్ యాప్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విద్యార్థులే లక్ష్యంగా సాగుతున్న లోన్ యాప్ల వేధింపులు, అధిక వడ్డీలు యువతను బలవన్మరణాలకు ప్రేరేపిస్తున్నాయి. సులభంగా డబ్బు వస్తుందన్న ఆశతో మొదలై, చివరకు అది ప్రాణాలు తీసే స్థాయికి చేరుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి : Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య

