అక్షరటుడే, వెబ్డెస్క్: Medchal Suicide Case | మేడ్చల్ జిల్లా (Medchal District) పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతిని పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిన నిందితుడు, ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకుని అమానుషానికి ఒడిగట్టాడు.
గత నెల 11వ తేదీన జరిగిన ఈ ఘటనలో, నిందితుడు బాధితురాలిని బంధించి, ఆమెకు బలవంతంగా హెచ్ఐవి (HIV) సోకిన రక్తాన్ని శరీరంలోకి ఎక్కించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో యువతి తీవ్ర మానసిక వేదనకు గురైంది. ప్రాణాంతక వ్యాధి సోకిందన్న భయం ఆమెను తీవ్రంగా కుంగదీశాయి. గత కొన్ని రోజులుగా మానసిక ఆందోళనలో ఉన్న బాధితురాలు, చివరకు తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Medchal Suicide Case | బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం పెళ్లికి ఒప్పుకోలేదన్న కారణంతో ఇంతటి క్రూర చర్యకు పాల్పడిన నిందితుడిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన మరోసారి మహిళల భద్రతపై ఆందోళనలు రేకెత్తించగా, ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Facebook Love Fraud | ఫేస్బుక్లో పరిచయమై సహజీవనం.. రూ.కోటితో పరారు
