అక్షరటుడే, భీమ్గల్/బాల్కొండ: Mendora Police | జిల్లాలోని మెండోరా మండలం (Mendora Mandal) పోచంపాడ్ గ్రామంలో పాతకక్షలు, ఆర్థిక లావాదేవీలు ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. అనుమానం, డబ్బుల గొడవతో ఐదుగురు వ్యక్తులు కలిసి దండుగుల రిషిక్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
Mendora Police | అసలేం జరిగిందంటే..?
పోలీసుల కథనం ప్రకారం.. పోచంపాడ్ గ్రామానికి (Pochampad Village) చెందిన వేముల నర్సింలుకు, దండుగుల రిషిక్కు మధ్య గత కొంతకాలంగా డబ్బుల వ్యవహారం, ఇతర వ్యక్తిగత కారణాలతో విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 6న రాత్రి 8 గంటల సమయంలో వీరి మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. ఆవేశానికి గురైన వేముల నర్సింలు, తన కుమారులు ఉదయ్, కిషోర్తో పాటు కోట అరవింద్, అలకుంట చందులతో కలిసి రిషిక్పై కట్టెలు, కత్తితో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నర్సింలు కత్తితో రిషిక్ కడుపులో బలంగా పొడవడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ 7న తెల్లవారుజామున రిషిక్ మృతి చెందాడు.
Mendora Police | దర్యాప్తు నిందితుల అరెస్ట్
ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మెండోరా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి.. నిన్న వేముల నర్సింలు, ఉదయ్ కిరణ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు పరారీలో ఉన్న కోట అరవింద్, అలకుంట చందులను కూడా పోలీసులు పట్టుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
Mendora Police | వస్తువుల స్వాధీనం..
నిందితుల సమాచారం మేరకు హత్యకు ఉపయోగించిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, శుక్రవారం కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం వారికి రిమాండ్ విధించడంతో నిందితులను జైలుకు తరలించినట్లు సీఐ జాన్ రెడ్డి (CI John Reddy) తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Rural Development Officer | జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా సాయన్న
